RBI Ombudsman | గతంతో పోలిస్తే బ్యాంకింగ్ లావాదేవీల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకులతోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి క్యాష్ పేమెంట్ సంస్థలు రావడంతో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు తేలిగ్గా అందుబాటులోకి వచ్చాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఎప్పుడైనా ఏదైనా సమస్య తలెత్తితే క్షణాల్లో పరిష్కరించుకునే వెసులుబాటు ఉంది. అయితే, కొన్ని రకాల ఫిర్యాదుల విషయమై మాత్రం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు నెలలు గడిచినా సమాధానం ఇవ్వనప్పుడు ఖాతాదారులకు ఏం చేయాలో తోచడం లేదు. ఎవరికి కంప్లయింట్ చేయాలన్న సంగతి తేల్చుకోలేకపోతున్నారు.
బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), నగదు పేమెంట్ సంస్థల లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తినా, సాంకేతిక సమస్యలు చోటు చేసుకున్నా.. సంబంధిత బ్యాంకుల ఖాతాదారులు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అంబుడ్స్మెన్ వ్యవస్థకు కంప్లయింట్ చేయవచ్చు. ఆర్బీఐ ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ పథకం తెచ్చింది. ఆర్బీఐ వెబ్సైట్ ద్వారా గానీ, 14440 హెల్ప్లైన్ నంబర్కు గానీ ఫోన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ యాప్లోనూ కంప్లయింట్ చేయొచ్చు.
సహేతుకమైన కారణం లేకుండా బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు నిరాకరించడం, ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్లో జాప్యం, చెక్లు, ముందస్తు సమాచారం లేకుండా చార్జీలు విధిస్తున్న బ్యాంకులపై ఎటువంటి ఫిర్యాదులైనా చేయవచ్చు.
అయితే, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, యూపీఐ పేమెంట్ సంస్థల ఖాతాదారులు నేరుగా ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థకు ఫిర్యాదు చేసే అవకాశం లేదు. ముందుగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ లేదా.. యూపీఐ యాప్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసి ఉండాలి. నెల దాటిన తర్వాత కూడా రియాక్షన్ లేకపోయినప్పుడే ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఫిర్యాదు చేసిన ఏడాది లోపు ఆర్బీఐ అంబుడ్స్మెన్కు కంప్లయింట్ చేయాలి. కన్జూమర్ ఫోరంలో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు చేసే కంప్లయింట్లను ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థ స్వీకరించదు.