న్యూఢిల్లీ, నవంబర్ 28: వ్యూహాత్మక వాటా విక్రయం తర్వాత ఐడీబీఐ బ్యాంక్.. భారతీయ ప్రైవేట్ రంగ బ్యాంక్గానే పరిగణించబడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) స్పష్టం చేసింది. వాటా అమ్మకం అనంతరం బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం వాటానే మిగలనున్నది. దీన్ని ‘పబ్లిక్ షేర్హోల్డింగ్’గా చూస్తారని దీపం తెలిపింది. గత నెల 7న ఎల్ఐసీతో కలిసి 60.72 శాతం వాటాను అమ్మేందుకు మోదీ సర్కారు బిడ్లను ఆహ్వానించింది.
ఈ బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ డిసెంబర్ 16. కాగా, బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి కలిపి 94.72 శాతం వాటా ఉన్నది. ఈ బిడ్డింగ్లో విజయం సాధించినవారు బ్యాంక్లోని మిగతా 5.28 శాతం పబ్లిక్ షేర్హోల్డింగ్ను సొంతం చేసుకోవడానికి ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ వ్యూహాత్మక వాటా విక్రయం పూర్తయితే బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసీకి కలిపి 34 శాతం వాటా ఉండనున్నది. ఇందులో కేంద్రానికి 15 శాతం, ఎల్ఐసీకి 19 శాతం వాటా ఉంటుంది. ఈ క్రమంలోనే ఐడీబీఐ ప్రైవేట్ బ్యాంక్గా మారిపోతుందని దీపం తెలియజేసింది.