IDBI Privatisation | మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితుల మధ్య వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల వాటాల ఉపసంహరణపై కేంద్రం ఆచీతూచీ స్పందిస్తున్నట్లు కనిపిస్తున్నది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, ఒక బీమా సంస్థల నుంచి వాటాలను ఉపసంహరించుకోవాలని ఇంతకుముందే కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఆ జాబితాలో ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ ప్రక్రియ కూడా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు హడావుడిగా ఐడీబీఐ బ్యాంకులో వాటాల ఉపసంహరణకు ప్రభుత్వం తొందరపడటం లేదని అధికార వర్గాల సమాచారం. అయితే, రెండు విడతలుగా ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించనున్నదని తెలియవచ్చింది.
ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ విధి విధానాలను ఖారు చేయడానికి ఇన్వెస్టర్లతో సమావేశాలు, రోడ్షోలు నిర్వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి కాకపోవచ్చునని, దీనికి ప్రస్తుత అస్థిర పరిస్థితులే కారణం అని ఆ వర్గాల కథనం. మార్కెట్లో పరిస్థితులను, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను పరిగణనలోకి తీసుకున్నాక గానీ.. ఐడీబీఐలో ప్రభుత్వ వాటాల విక్రయంపై కేంద్రం దృష్టి సారించదు. తొలిదశలో 26-45 శాతం, అటుపై మిగతా వాటా విక్రయించాలని కేంద్రం యోచిస్తున్నట్లు కనిపిస్తున్నది.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉన్నది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వాటా 49.24 శాతం. అయితే, తాజాగా ప్రభుత్వం విక్రయించే వాటాలో ఎల్ఐసీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలంగా ఐడీబీఐ బ్యాంక్ విక్రయం ప్రభుత్వ ఎజెండాలో ఉన్నది. బిడ్లు దాఖలు కాకపోవడంతో బీపీసీఎల్ వాటాల విక్రయ ప్రక్రియను కేంద్రం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను విక్రయించే విషయమై వెనుకడుగు వేసింది కేంద్రం.