ముంబై, ఏప్రిల్ 22: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ రూ.9,852,70 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 27 శాతం అధికమని పేర్కొంది. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ లాభం ఏడాది ప్రాతిపదికన 30 శాతం ఎగబాకి రూ.9,121.87 కోట్లుగా నమోదైంది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.27,412.32 కోట్ల నుంచి రూ.36,108.88 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది బ్యాంక్. మరోవైపు నిర్వహణ ఖర్చులు రూ.17,119.38 కోట్ల నుంచి రూ.22,282.50 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.60 శాతం నుంచి 2.81 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.1,619.80 కోట్ల నిధులను వెచ్చించింది. ఏడాది క్రితం కేటాయించిన రూ.1,068.95 కోట్ల కంటే అధికమని పేర్కొంది.