Layoffs : కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగడం కలకలం రేపుతోంది. మార్చిలోనే ఐబీఎం, డెల్, యాపిల్ సహా పలు కంపెనీలు వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. దిగ్గజ టెక్ కంపెనీలు వందలాది మందిని సాగనంపగా ఎరిక్సన్ ఇటీవల 1200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఖర్చులకు కళ్లెం వేసేందుకు డెల్ ఇటీవల 6000 మంది ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం.
కంప్యూటర్ల విక్రయం తగ్గుముఖం పట్టడంతో గత క్వార్టర్లో కంపెనీకి 11 శాతం రాబడి నష్టం వాటిల్లింది. ఇక ఐబీఎం సైతం తాజా లేఆఫ్స్కు తెగబడింది. కంపెనీ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడింది. 5జీ ఎక్విప్మెంట్కు డిమాండ్ తగ్గడంతో స్వీడన్లో 1200 మంది ఉద్యోగులను ఎరిక్సన్ తొలగించింది. వ్యయ నియంత్రణ చర్యలతో పాటు పనితీరు మెరుగుపరుచుకునే క్రమంలో ఎరిక్సన్ లేఆఫ్స్కు మొగ్గుచూపిందని చెబుతున్నారు.
టెక్ దిగ్గజం యాపిల్ సైతం ఇటీవల పలువురు ఉద్యోగులను సాగనంపిందని సమాచారం. స్మార్ట్వాచ్ డిస్ప్లేలకు మైక్రోఎల్ఈడీ టెక్నాలజీ డెవలప్ చేసే ప్రాజెక్టు ముగియడంతో యాపిల్ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పలువురు ఉద్యోగులపై వేటు వేయడం లేదా తొలగింపుల ప్రక్రియపై కసరత్తు సాగించడం జరుగుతున్నదని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. ట్రస్ట్, సేఫ్టీ విభాగాల్లో లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
Read More :
Cops Suspended | మంత్రి కుమారుడిపై కేసు నమోదు.. నలుగురు పోలీసులు సస్పెండ్