Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రధాన నగరాల్లో 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం తెలిపింది. ఓ వెబినార్లో భారతీయ హౌజింగ్, ఆఫీస్ మార్కెట్పై విడుదల చేసిన తమ నివేదికలో కార్యాలయ స్థల విపణిలో గత ఏడాది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) హవా స్పష్టంగా కనిపించినట్టు పేర్కొన్నది.
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక-రాజకీయ ఆందోళనకర పరిస్థితులున్నా.. హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 2022తో పోల్చితే 2023లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ 15 శాతం పెరిగి 59.6 మిలియన్ చదరపు అడుగులకు చేరినట్టు నైట్ ఫ్రాంక్ వివరించింది. 2019 (60.6 మిలియన్ చదరపు అడుగులు)లో గరిష్ఠంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. ఆ తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం.
బెంగళూరు డౌన్
గత ఏడాది బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ మందగించింది. 2023లో 12.5 మిలియన్ చదరపు అడుగులకే పరిమితమైంది. 2022తో పోల్చితే 14 శాతం తగ్గింది. ఇదే సమయంలో హైదరాబాద్లో 32 శాతం వృద్ధి కనిపించడం గమనార్హం. ఇక్కడ 8.8 మిలియన్ చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగిందని నైట్ ఫ్రాంక్ తెలియజేసింది. మొత్తంగా చూసినైట్టెతే నిరుడు బెంగళూరు, అహ్మదాబాద్ల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ పడిపోగా.. చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణెల్లో పెరిగింది.
జీసీసీల హవా..
దేశీయ ఆఫీస్ స్పేస్ లీజింగ్లో జీసీసీల హవా స్పష్టంగా కనిపిస్తున్నది. 2023లో 20.8 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని జీసీసీలు తీసుకున్నాయి. 2022తో పోల్చితే 58 శాతం పెరగడం గమనార్హం. చెన్నై తర్వాత హైదరాబాద్ ఆఫీస్ స్పేస్పైనే జీసీసీ కంపెనీలు మక్కువ చూపాయని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ జోసెఫ్ తిలక్ తెలిపారు. హైదరాబాద్లో అత్యుత్తమ జీవనశైలి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ, నైపుణ్యం కలిగిన యువత ఉండటం కార్పొరేట్లకు కలిసొస్తున్నది. అదీగాక దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఉన్నది. ఈ క్రమంలోనే అద్దెలు ఎలా ఉన్నా డిమాండ్ మాత్రం తగ్గడం లేదు.
32,880 గృహాల విక్రయాలు
గత ఏడాది కాలంలో హైదరాబాద్లో 32,880 యూనిట్ల ఇండ్లు అమ్ముడయ్యాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇందులో మధ్యతరగతి ఇండ్లు, సరసమైన ధరల్లో ఉండే గృహాల కంటే అధిక బడ్జెట్ కూడిన ఇండ్ల క్రయవిక్రయాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. గత ఏడాదితో పోల్చితే వృద్ధి 6 శాతంగా ఉండగా, ధరల పెరుగుదల మాత్రం 11 శాతంగా ఉందని జోసెఫ్ తిలక్ తెలిపారు. అదే సమయంలో నగరంలో నివాస గృహాల కొత్త ప్రాజెక్టులు ఏడాది కాలంలో 46,985 యూనిట్లు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు.