హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సోమవారం ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)తో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-సెప్టెంబర్లో 24 శాతం వృద్ధితో మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 12 మిలియన్ల (కోటీ 20 లక్షలపైనే)కుపైగా ప్రయాణికులకు విమానయాన సేవలు అందాయి.
కాగా, ఇదే సమయంలో దేశం మొత్తం మీద విమాన ప్రయాణికుల రద్దీ 75.4 మిలియన్లుగా ఉన్నట్టు తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవల్లో 3వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ఇక జీహెచ్ఐఏఎల్లో విమానాల రాకపోకలు (ఎయిర్ ట్రాఫిక్ మూమెంట్స్ లేదా ఏటీఎం) ఈ ఏప్రిల్-సెప్టెంబర్లో గణనీయంగా పెరిగి 42,625గా నమోదయ్యాయి. ఇందులో దేశీయ విమాన సర్వీసులు 35,782, అంతర్జాతీయ విమాన సర్వీసులు 6,843గా ఉన్నాయి.
జూలై-సెప్టెంబర్లో..
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో దేశీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ 24 శాతం, అంతర్జాతీయంగా 23 శాతం పెరిగింది. నిరుడు జూలై-సెప్టెంబర్లో ప్యాసింజర్లు 4.9 మిలియన్లుగా ఉంటే, ఈసారి 6 మిలియన్లకుపైగానే ఉన్నారు. ఒక్క ఈ అక్టోబర్ నెలలోనే దేశీయ ప్రయాణికులు 20 లక్షలుగా ఉన్నారని జీహెచ్ఐఏఎల్ తెలియజేసింది. నిరుడు ఇదే నెల 14.8 లక్షలే. అలాగే అక్టోబర్లో శంషాబాద్లోని ఈ ఎయిర్పోర్టు నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు 3 లక్షలుగా నమోదయ్యారు. గత ఏడాది 2 లక్షలే. అక్టోబర్లో విమాన సర్వీసులు దేశీయంగా 12,548, అంతర్జాతీయంగా 2,198 ఉన్నాయి. నిరుడుతో పోల్చితే 12 శాతం వృద్ధి ఉన్నది.