2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవలం రూ. 2.62 లక్షల కోట్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ. 4.97 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఇందులో మదుపు చేసిన ఇన్వెస్టర్ల సంఖ్య కూడా 1.13 కోట్లకు పెరిగారు. హైబ్రిడ్ ఫండ్లు మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీలు, స్థిర రాబడుల్ని ఇచ్చే ఆర్థిక సాధనాల్లో మదుపు చేస్తాయి. ప్రస్తుతం దాదాపు 137 హైబ్రిడ్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలన్నదానిపై సందేహాలు అనేకం. వాటికి ఇవిగో సమాధానాలు…
కన్వర్జేటివ్ హైబ్రిడ్ ఫండ్స్
ఈ ఫండ్లు 75 నుంచి 90 శాతం డెట్ సాధనాల్లోనూ, మిగిలిన 10 నుంచి 25 శాతం ఈక్విటీల్లో మదుపు చేస్తాయి. రుణ సాధనాలతో పాటు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లలో కూడా పది శాతం మొత్తాన్ని మదుపు చేస్తాయి. ఈ ఫండ్లు సాధారణ డెట్ ఫండ్ల కన్నా కాస్త ఎక్కువ రాబడిని ఇస్తాయి. ఈక్విటీల్లో కూడా మదుపు చేయడం వల్ల ఎన్ఏవీ ల్లో మార్పులు చేర్పులు మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా ఉంటాయి. ఒకటి నుంచి రెండేండ్ల కాల పరిమితికి వీటిలో మదుపు చేయవచ్చు. ప్రస్తుతం ఇలాంటి హైబ్రిడ్ ఫండ్లు 21 ఉన్నాయి. వీటిలో మొత్తం రూ. 20,825 కోట్లు నిధులున్నాయి.
బ్యాలన్స్డ్ ఫండ్స్
ఈ ఫండ్లు ఈక్విటీల్లో చేసే మదుపు 40 నుంచి 60 శాతం మేర ఉంటుంది. అలా గే రుణ సాధానాల్లో మదుపు కూడా 40 నుంచి 60 శాతం మధ్య అటుఇటుగా ఉంటుంది. వీటిలో రిస్క్ కొంచెం ఎక్కువ. అలాగే రాబడులు కూడా అధికమే. ఈ కేటగిరిలో 33 ఫండ్లు ఉండగా, రూ 1.46 కోట్ల మేర నిధులున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఈక్విటీల్లో మదుపు మొత్తం మారుతూ ఉంటుంది. అలాగే మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పడు రుణ సాధనాల కన్నా ఈక్విటీల్లో అధిక మొత్తం మదుపు చేయడం వల్ల రాబడులు అధికంగానే ఉంటాయి.
అగ్రెసివ్ ఫండ్స్
వీటి పేరు తగ్గట్టుగానే ఈక్విటీల్లో అధిక శాతం మదుపు చేస్తాయి. కనీసంగా 65 శాతం, గరిష్టంగా 85 శాతం పెట్టుబడి చేస్తాయి. అలాగే రుణ సాధనాల్లో 20 నుంచి 35 శాతం వరకు మదుపు చేస్తాయి. ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాలను మదు పు చేయడం వల్ల బ్యాలన్స్డ్ హైబ్రిడ్ ఫండ్ల కన్నా అధిక రాబడినిచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే రిస్క్ ఎక్కువ. మూడేండ్లు అంత కన్నా ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకోవాలి.
డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్స్
వీటిలో ఫండ్ మేనేజర్ విశ్లేషణకు తగ్గట్టుగా ఎందులో ఎక్కువ అవకాశాలుంటే అందులోనే అధిక మొత్తాలను మదుపు చేస్తారు. నిఫ్టీ 500 ఇండెక్స్ మార్కెట్ వాల్యూయేషన్లకు అనుగుణంగా మదుపు నిర్ణయాలుంటాయి. స్టాక్స్లో నేరుగా లేదా ఈక్విటీ ఫండ్ ఆఫ్ ఫండ్లలో మదుపు చేస్తాయి. కనీసం మూడేండ్లకుపై కాలపరిమితికి మాత్రమే అధిక రాబడిని ఇచ్చే అవకాశాలుంటాయి.
మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్
ఈ ఫండ్లు ఈక్విటీ, రుణ సాధనాలు, గోల్డ్ వంటి అసెట్ క్లాస్లలో మదుపు చేస్తాయి. వీటిలో కనీసంగా 10 శాతం చొప్పున మదుపు చేస్తాయి. ఆ తర్వాత అందుబాటులో ఉన్నాయి అవకాశాలను బట్టి ఆయా సాధనాల్లో మదుపు చేస్తాయి. అన్ని అసెట్లోనూ కనీసంగా పది శాతం మదుపు చేయాలన్న నిబంధన కారణంగా డైవర్సిఫికేషన్ జరుగుతుంది. వాల్యూయేషన్ బట్టి ఈక్విటీల్లో అధికంగా మదుపు చేయడం వల్ల రాబడులు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఈక్విటీల్లో గరిష్టంగా 50 నుంచి 70 శాతం వరకు మదుపు చేసే వీలుంది.