HPCL in Loss | కేంద్ర ముడి చమురు సంస్థ.. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) భారీ నష్టాల్లో కూరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,196 కోట్ల నష్టాలు వచ్చాయని శనివారం ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో హెచ్పీసీఎల్ నికర నష్టం రూ.1795 కోట్లు మాత్రమే. దీంతో హెచ్పీసీఎల్కు వచ్చిన నష్టాల్లో ఇదే అత్యధికంగా భావించొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలతో సంబంధం లేకుండా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగించడం వల్ల నష్టాలు చవి చూడాల్సి వచ్చినట్లు తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మార్పులకు గురవుతున్నా.. కేంద్ర చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు మూడు నెలలకు పైగా యధాతథంగా కొనసాగిస్తున్నాయి.
ఇక చమురు ఉత్పత్తుల విక్రయం ద్వారా జూన్ త్రైమాసికంలో రూ.1,21 లక్షల కోట్ల ఆదాయాన్ని హెచ్పీసీఎల్ సముపార్జించింది. గతేడాది తొలి త్రైమాసికంలో రూ.77,308 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. ఆందోళనకర స్థాయిలో వివిధ ఉత్పత్తులు, వస్తువుల ధరలు పెరిగిపోవడంతో.. వాటిని కట్టడి చేయడానికి కేంద్రం, ఆర్బీఐ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర చమురు సంస్థలు సవరించడం లేదు. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 109 డాలర్లు చెల్లించిన కేంద్ర చమురు సంస్థలు దేశీయ మార్కెట్లో 85 నుంచి 96 డాలర్లకే విక్రయాలు చేపట్టడం నష్టాలకు దారి తీసిన కారణాల్లో ఒకటి.
కాగా, హెచ్పీసీఎల్ కంటే అతిపెద్ద సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) రూ.1992 కోట్ల నష్టం మాత్రమే ప్రకటించింది. ఐవోసీ చమురు విక్రయాలతోపాటు ముడి చమురు రిఫైనింగ్, పెట్రో కెమికల్ వ్యాపార లావాదేవీలు నిర్వహించడం వల్ల నష్టాలు తగ్గాయని చెబుతున్నారు.