వంశీకి ఒకసారి అత్యవసరంగా నగదు కావాల్సి వచ్చింది. వెంటనే కనిపించిన ఏటీఎం వద్దకు వెళ్లాడు. కానీ తనవద్ద ఏటీఎం కార్డు లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. అయినప్పటికీ మనీ విత్డ్రా చేసుకోగలిగాడు. అవును.. ఏటీఎం కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశమున్నది. కార్డు లేనప్పటికీ ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణలకు ఇంటరాపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) ఫీచర్ వీలు కల్పిస్తున్నది మరి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఐసీసీడబ్ల్యూను ప్రోత్సహించాలని బ్యాంకులకు సూచిస్తున్నది. క్లోనింగ్, స్కిమ్మింగ్ తదితర సైబర్ మోసాలను అరికట్టేలా ఏటీఎంల్లో ఐసీసీడబ్ల్యూ ఆప్షన్ను పెట్టాలంటున్నది. ఎస్బీఐ, పీఎన్బీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులన్నీ తమ ఏటీఎంల్లో కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ సౌకర్యాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి కూడా. దీంతో ఇప్పుడు గూగుల్పే, ఫోన్పే, పేటీఎం ఇతర ఏ యూపీఐ పేమెంట్ సర్వీస్ యాప్స్ వినియోగం ద్వారానైనా నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే రూ.5,000 వరకు మాత్రమే తీసుకోవడానికి వీలున్నది.
యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్స్ కోసం బ్యాంకులు ఎటువంటి అదనపు చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం లేదు. అయితే వేర్వేరు బ్యాంకుల ఏటీఎంల నుంచి పరిమితికి మించి నగదు ఉపసంహరణలు చేసినట్టయితే కార్డు లావాదేవీలకున్నట్టే చార్జీలు వర్తిస్తాయి.