దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. గతేడాది మార్చి రికార్డు స్థాయి పతనం నుంచి నిఫ్టీ దాదాపు 120 శాతం పెరిగింది. దీంతో అన్నిరకాల స్టాక్స్, వాటిలో మదుపు చేసే మ్యూచువల్ ఫండ్లు మునుపెన్నడూ లేనంతగా రాబడిని ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ విలువ ఐదింతలు, పదింతలు పెరిగింది. దీంతో కొత్తగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్యా గణనీయంగా పెరిగింది. ఇందుకు పెరిగిన డీమ్యాట్ అకౌంట్లే ఉదాహరణ. ఈ దశలో మార్కెట్లో మదుపు చేయవచ్చా? ఇన్వెస్టర్లకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. చేస్తే ఎలాంటి షేర్లలో ఎంత మదుపు చేయాలి? అనేది మరో ప్రశ్న. ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా మదుపు పద్ధతులేమిటో చూద్దాం.
ఎంత మొత్తం?
మదుపు చేయాలని నిర్ణయించుకున్నాక ఎంత మొత్తాన్నైనా పెట్టుబడిగా పెట్టవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో మదుపు చేయాలనుకుంటే ఆ మొత్తాన్ని పది భాగాలుగా చేసుకుని వాటిలో మదుపు చేయడం.. లేదా చిన్న మొత్తాల్లోనే మదుపు చేయాలనుకుంటే ఎంపిక చేసుకున్న షేర్లలో ప్రతి నెలా ఎస్ఐపీ మాదిరిగా మదుపు చేస్తూ పోవచ్చు. నేరుగా స్టాక్స్ను ఎంపిక చేసుకోలేకపోతే, కనీసం నాలుగైదు మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో ఎస్ఐపీ ద్వారా మదుపు చేసుకుంటూ పోవచ్చు. స్టాక్స్లోనే మదుపు చేయాలనుకుంటే తొలుత అగ్రగామి కంపెనీలకే పరిమితం కండి.
ఎంత రాబడి?
స్టాక్ మార్కెట్లో రాబడులకు గ్యారంటీ ఉండదు. అలాగే స్థిరంగా ఏటా ఇంత రాబడి అంటూ ఉండదు. అలా ఎవరైనా మీకు హామీలు గుప్పిస్తే అది మోసమే. అయితే అన్ని ఇన్వెస్ట్మెంట్ సాధానాల కన్నా ఈక్విటీ షేర్లలో రాబడులు అధికంగా ఉంటాయన్నది చారిత్రక సత్యం. మదుపు చేసే కాలపరిమితి పెరిగేకొద్దీ రాబడులు పెరుగుతూ ఉంటాయి.
ఏది మంచి సమయం?
మార్కెట్లో అవకాశాలు ప్రతి రోజూ ఉంటాయి. అయితే నిలకడగా రాబడి సాధించాలంటే తమకంటూ వ్యూహం ఉండాలి. అది షేర్లను ఎంపిక చేసుకోవడంలో, వాటిలో మదుపు చేసే మొత్తాన్ని నిర్ణయించుకోవడంలోనూ, అలాగే నష్టం వస్తే తక్షణమే బయటపడేందుకు, లాభాలను ఎప్పటికప్పుడు స్వీకరించడానికి వ్యూహాలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి.
డైవర్సిఫికేషన్
ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బాండ్లు తదితర వాటిలో మదుపు చేయవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్లలో ఇండెక్స్ ఫండ్లు, సెక్టార్ ఫండ్లు, హైబ్రిడ్ ఫండ్లతోపాటు ఈటీఎఫ్లలో మదుపు చేయవచ్చు.
రిస్క్లు..
స్టాక్ మార్కెట్లో మదుపు మిగతా వాటితో పోల్చితే రిస్క్తో కూడుకున్నది. విధాన నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, కంపెనీల ప్రదర్శన, మేనేజ్మెంట్ల పనితీరు, అంతర్జాతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో మార్పులు వంటివి షేర్ల ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకని మదుపు చేసే ముందు వీటన్నింటి మీద అవగాహన పెంచుకోవడం అవసరం.