హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమాచారం ఏజెంట్ల ద్వారా ప్రతి గడపకు చేరుతుందని, ఈ నేపథ్యంలో ఏజెంట్లు సరైన సమాచారాన్ని అందించి కొనుగోలుదారులు మోసాలకు గురి కాకుండా చూడాలని రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ అన్నారు.
శుకవారం హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ), రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలను జ్యోతి వెలిగించి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి కొనుగోలుదారుల అభిప్రాయాలు తెలుసుకొని బిల్డర్లకు ప్రమోటర్లకు సరైన రీతిలో గైడ్ చేయాలని, అలాగే ఏజెంట్లు అందరూ విధిగా రెరా లో రిజిస్టర్ కావాలని, ఆ తరువాత మాత్రమే వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలన్నారు.
రిజిస్టర్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలన చేసి 48 గంటలలోనే రిజిస్ట్రేషన్ పత్రం జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బిల్డర్లు, ప్రమోటర్లు త్రైమాసిక వార్షిక నివేదికలు సకాలంలో పంపేలా ఏజెంట్లు కూడా బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.