Homes Demand | సొంతింటి కోసం గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు ఇండ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని దాదాపు 50 శాతం మంది ఇండ్ల కొనుగోలు దారులు అంచనా వేస్తున్నారు. 47 శాతం మంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 21 శాతం మంది మాత్రం స్టాక్ మార్కెట్లు, 16 శాతం మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్కు మొగ్గు చూపుతున్నారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మార్గంగా భావిస్తున్న బంగారంపై 15 శాతం మంది మాత్రమే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారని హౌసింగ్ డాట్ కామ్, రియాల్టీ ఇండస్ట్రీ బాడీ నారెడ్కో సర్వేలో తేలింది.
58 శాతం మంది ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇండ్లలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నారని హౌసింగ్ డాట్ కామ్, నారెడ్కో సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 1000 మందికి పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. `రెసిడెన్షియల్ రియాల్టీ కన్జూమర్ సెంటిమెంట్ సర్వే హెచ్2-2022` నివేదికను రియాల్టీ పోర్టల్ హౌసింగ్ డాట్ కాం, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) సోమవారం విడుదల చేశాయి. మున్ముందు ఇండ్ల ధరలు పెరుగుతాయని 48 శాతం మంది అంచనా వేస్తున్నారు.
కొవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత భారత రెసిడెన్షియల్ మార్కెట్లో సొంతిండ్లకు డిమాండ్ శరవేగంగా పెరిగిందని హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్టైగర్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ సీఈవో ధృవ్ అగర్వాలా చెప్పారు. రుణాల వ్యయం, పెరుగుదల, ఇన్పుట్ కాస్ట్ పెరుగుదలతోపాటు గిరాకీ ఎక్కువ కావడంతోనూ ఇండ్ల ధరలు పెరుగుతాయన్నారు.
కొవిడ్ మహమ్మారి తర్వాత భారత్లో రియాల్టీ రంగం రికవరీ దిశగా అడుగులేస్తున్నదని నారెడ్కో అధ్యక్షుడు రాజన్ బండేల్కర్ చెప్పారు. రియాల్టీ రంగ పురోభివృద్ధికి పలు విధాన నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఒకవైపు వడ్డీరేట్లు పెరుగుతున్నా దేశంలో ఇండ్ల కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయన్నారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరిలో పెరిగిపోయిందన్నారు. ఇండ్ల ధరలు, వడ్డీరేట్లు పెరిగిపోయినా 2022లో ఇండ్ల గిరాకీ యథాతథంగా కొనసాగుతుందని హౌసింగ్ డాట్ కామ్ రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ చెప్పారు.