హైదరాబాద్ : ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో సరికొత్త సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడమే కాకుండా, సరఫరా వంటి వాటివైపు కూడా దృష్టి సారిస్తోంది హోండా. ఇందులో భాగంగానే హోండా సంస్థ ఇండియాలో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ , బ్యాటరీ మార్పిడి వంటి సేవలు అందించనున్నది. అందుకోసమే
“హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ “పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేసింది. దీనిద్వారానే హోండా బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందించనున్నది. 2022 జూన్ ,జులై నుంచి భారతీయ మార్కెట్లోని ఇ -ఆటో-రిక్షాల కోసం బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందించనుంది. అయితే మొదట ఈ సర్వీస్ బెంగళూరులో అందుబాటులోకి ఏర్పాటు చేయనున్నది. ఆ తరువాత దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానుంది.
హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఈ-బ్యాటరీని కూడా భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తుంది. తమ సర్వీస్ సబ్స్క్రైబర్లు బ్యాటరీని మార్చుకోవడానికి సమీపంలోని బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్ నుంచి సర్వీస్ పొందవచ్చని కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రారంభించిన ఈ సర్వీస్ వల్ల ఆటో-రిక్షా డ్రైవర్లు ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల వారి సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, తమ వ్యాపార అభివృద్ధికి సహకరిస్తుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించిన తర్వాత కొత్త అనుబంధ సంస్థలతో కూడా కంపెనీ భాగస్వామి అవుతుంది. వచ్చే ఐదేళ్లలో పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని హోండా యోచిస్తోంది. కంపెనీ 2040 తర్వాత పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది.