Home Loans | ఆర్బీఐ రెపోరేట్ 93 రోజుల్లో మూడోసారి పెంచేసింది. మేలో అత్యవసరంగా సమావేశమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష కమిటీ తొలుత 40 బేసిక్ పాయింట్లు.. జూన్ నాలుగో తేదీన 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచింది. తాజాగా శుక్రవారం (2022 ఆగస్టు 5) 50 బేసిక్ పాయింట్ల రెపోరేట్ పెంచివేసింది. అంటే 93 రోజుల్లో 1.40 శాతం (140 బేసిక్ పాయింట్లు) రెపోరేట్ పెంచినట్లయింది. ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా వాణిజ్య బ్యాంకులన్నీ తమ రెపోరేట్ బేస్డ్ లేదా లింక్డ్ లెండింగ్ రేట్లు సవరించేస్తాయి. దీని ప్రకారంగా ఇండ్ల రుణాలు మొదలు ప్రతి లోన్మీద నెలసరి వాయిదా భారం పెరుగనున్నది. నెలవారీ ఈఎంఐ ఎక్కువ చెల్లించాల్సి రావడంతో ఇంటి రుణం ప్రియంగా మారుతుంది. వడ్డీరేట్ల పెంపు వల్ల ఒకవేళ ఓ ఫైనాన్సియల్ ప్లానింగ్ దిగజారిపోతుంటే మాత్రం కొన్ని చర్యలు తీసుకుంటే కాసింత ఉపశమనం లభిస్తుంది. వడ్డీరేట్ల పెరుగుదలతో మీ ఫైనాన్సియల్ ప్లానింగ్కు అనుగుణంగా మీ బడ్జెట్పై భారం పడకుండా నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దామా.. !
మీరు ఇంటి రుణం తీసుకున్నప్పుడు నిర్ణయించిన వడ్డీరేటుకు.. ఇప్పుడు సవరించిన వడ్డీరేటుకు మధ్య తేడా 0.25-0.50శాతం తేడా ఉందా.. ? ఉదాహరణకు మీరు ఏడు శాతం వడ్డీరేటుపై రుణం తీసుకున్నారనుకుందాం.. ఇప్పుడు రెపోరేట్ పెరుగుదలతో అది కాస్త 7.50 శాతంగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పెరిగిన వడ్డీరేటు భారానికి సమాన మొత్తం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది.
ఈ పరిస్థితుల్లో మీరు 20 ఏండ్ల టెన్యూర్ గల రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు ప్రతి రూ.లక్ష రుణంపై సుమారు రూ.7,400 చొప్పున ఆదా చేసినట్లే. అయితే సగానికి పైగా రుణ గడువు దాటినప్పుడు మాత్రమే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సరైన నిర్ణయం అవుతుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, ఎంవోడీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది మరి.
మీ వేతనం పెరిగినా.. ఈఎంఐ స్థిరంగా ఉందా.. అప్పుడు స్వచ్ఛందంగా మీ ఈఎంఐ భారం పెంచేసుకోవచ్చు. అదనపు ఈఎంఐ చెల్లింపుతో రుణంలో అసలు మొత్తం తగ్గుతుంది. త్వరితగతిన మీ రుణం చెల్లింపు పూర్తవుతుంది. మీ లోన్ టెన్యూర్ కుదించుకుపోతుంది. ఈ పద్దతి చిన్నపాటి ప్రీ-పేమెంట్ వంటిది.
ఉదాహరణకు 20 ఏండ్ల కాలానికి రూ.30 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. ఏడు శాతం వడ్డీపై ఈఎంఐ సుమారు రూ.23 వేలు. ఒకవేళ రెండో ఏడాది నుంచి మీరు రూ.26 వేలు పెంచారనుకుందాం.. అలా చేస్తే ప్రతియేటా మూడు ఈఎంఐలు తగ్గుతాయి. అంతేకాదు వడ్డీరేటు కూడా రూ.25.96 లక్షల నుంచి రూ.25.10 లక్షలకు దిగి వస్తుంది.
పెరిగిన వడ్డీరేటుకు అనుగుణంగా మీ ఈఎంఐ (నెలసరి వాయిదా) కూడా పెరుగొద్దనుకుంటున్నారా.. అప్పుడు మూడో ఆప్షన్ ఉంది. ఏడాదికోసారి ప్రీ-పేమెంట్ చేస్తే.. రుణంలో అసలు మొత్తం తగ్గుతుంది. అత్యధిక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు నెలసరి వాయిదాపై 1-2 రెట్లు ప్రీ-పేమెంట్స్ చేయడాన్ని స్వాగతిస్తాయి.
ఉదాహరణకు 20 ఏండ్ల గడువుతో రూ.30 లక్షల ఇండ్ల రుణం తీసుకున్నారనుకోండి. మీరు చెల్లిస్తున్న వడ్డీరేటు ఏడు శాతం. అటువంటప్పుడు మీరు రూ.50 వేలు ప్రీ-పేమెంట్ చేశారనుకోండి.. అప్పుడు ఏడు ఈఎంఐలు తగ్గుతాయి. చెల్లించాల్సిన వడ్డీ రూ.25.96 లక్షల నుంచి రూ.24.48 లక్షలకు తగ్గుతుంది.
ఇంటి రుణ ఈఎంఐ వల్ల పలు దఫాలు నెలవారీ ఖర్చులపై ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అదనపు ఆదాయం.. పొదుపు చేసిన సొమ్ము లేకపోతే మీరు మీ ఈఎంఐలను తగ్గించుకోవడమే మార్గం.. అందుకు రుణం గడువు (లోన్ టెన్యూర్) పెంచుకోవడమే మార్గం. కానీ, వడ్డీ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.