Home Loans | పెరిగిపోతున్న ధరలను అదుపు చేయడానికి భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మరో దపా 50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెంచివేసింది. ఫలితంగా రెపోరేట్తో లింక్ అయి ఉన్న రుణాలపై వడ్డీరేట్లు కూడా పెరుగుతాయి. రుణంతో సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు పెరుగుతున్న వడ్డీరేట్లను జాగ్రత్తగా పరిశీలించాక నిర్ణయం తీసుకుంటే మంచిదని బ్యాంకింగ్ నిపుణులు అంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఇల్లు కొనొచ్చా.. వడ్డీరేట్లు మున్ముందు తగ్గే అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలు పరిశీలనకు వస్తాయి. మే నెలకు ముందు వివిధ రుణాలపై వడ్డీరేట్లు అత్యంత కనిష్ట స్థాయిలో ఉండేవి. ఇప్పుడు.. కొవిడ్-19 ముందు నాటి పరిస్థితికి చేరుతున్నాయి. ఆర్బీఐ రెపోరేట్ పెంపుదలకు అనుగుణంగా బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీరేట్లను సవరిస్తున్నాయి. మే నెల ఆరంభంలో 6-6.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు.. ఇప్పుడు 7.40-7.95 శాతానికి చేరాయి.
ఇప్పటికే రుణాలతో ఇండ్లు కొనుక్కున్నవారైనా.. వాహనాలపై రుణాలు తీసుకున్నా.. నెలవారీ రుణ వాయిదాల్లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ, రుణం చెల్లింపు గడువు పెరుగుతుంది. ఇంటి రుణం అంటేనే దీర్ఘ కాలికం కనుక వడ్డీరేట్లు హెచ్చుతగ్గులను బట్టి గడువును ప్రభావితం చేస్తాయి.
వడ్డీరేట్లు పెరగడంతో ఇప్పటికిప్పుడు ఇండ్ల రుణాలు తీసుకోవాలని భావించే వారి రుణ అర్హతలు తగ్గుతాయి. ఉదాహరణకు కొత్త ఇంటి కొనుగోలు కోసం మీరు 25 ఏండ్ల గడువుతో రూ.30 లక్షల రుణం తీసుకున్నారని అనుకుందాం. దానిపై 6.5 శాతం వడ్డీరేటు అమలైతే నెలవారీ వాయిదా (ఈఎంఐ) రూ.20,256 చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీరేటు ఇప్పటివరకు 1.40 శాతం పెరిగినందున ఈఎంఐ రూ.22,956లకు పెరుగుతుంది. అంటే అదనంగా రూ.2,700 నెలవారీ భారం పడుతుంది. దీని ప్రకారం మొత్తం రూ.30 లక్షల రుణంలో ప్రతి రూ. లక్షపై రూ.90 చెల్లించాలి.
బ్యాంకులు కూడా రుణ గ్రహీతల వయస్సు, ఆదాయాన్ని బట్టి రుణం నిర్ణయిస్తాయి. అదీ కూడా వడ్డీరేటు పెరిగితే రుణ అర్హత పడిపోతుంది. దీని ప్రకారం కొత్తగా రూ.30 లక్షల ఇండ్ల రుణం తీసుకోవాలని భావించిన వారికి వడ్డీరేట్లు పెరగడంతో రూ.26.50 లక్షల లోన్ మాత్రమే మంజూరవుతుంది. అప్పుడు నెలవారీ వాయిదా (ఈఎంఐ) రూ.20,256 చెల్లించాల్సి వస్తుంది.
రుణ అర్హత తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి రుణం తీసుకోవడం సబబేనా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ ధరలు అదుపులోకి రాకపోతే వడ్డీరేట్ల విషయమై ఆర్బీఐ భవిష్యత్లో మరింత కఠినంగా వ్యవహరిస్తుందని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితులే కొనసాగితే మరో 35-50 బేసిక్ పాయింట్లు రెపోరేట్ పెరుగుతుందని.. మొత్తం ఆర్బీఐ రెపోరేట్ 5.40 నుంచి 5.75-5.90 శాతానికి చేరు అవకాశాలు కనిపిస్తుందని వారు అంటున్నారు.
ఆర్బీఐ రెపోరేట్ 5.75-5.90 శాతానికి చేరితే వాణిజ్య బ్యాంకుల వడ్డీరేట్లు మరింత ప్రియం అవుతాయి. రుణ అర్హతలు పడిపోతాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావించేవారు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక సిబిల్ స్కోర్ 750 పాయింట్లకు పైగా ఉన్న వారు అధిక వడ్డీరేట్ ఉన్న బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ గల బ్యాంకులకు తమ రుణాలను ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలను పరిశీలించుకోవచ్చు.
అత్యంత కనిష్ఠ స్థాయికి వడ్డీరేట్లు పడిపోయినప్పుడు ఇండ్ల రుణాలివ్వడానికి బ్యాంకులు పలు రకాల ప్రోత్సాహకాలిచ్చాయి. కానీ, వడ్డీరేట్లు పెరిగినందున బ్యాంకులు ఆచితూచి వ్యవహరించనున్నాయి. పర్సనల్ లేదా హోం లోన్ల అప్లికేషన్లను బ్యాంకుల అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలో తీసుకున్న రుణాల చెల్లింపునకు ప్రామాణికంగా ఉన్న సిబిల్ స్కోర్ను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళుతున్నాయి. కొత్త ఇండ్ల ప్రాజెక్టులకు రుణాలను మంజూరు చేసే విషయంలోనూ బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.