EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించారు. అర్హత ఉన్న ఈపీఎఫ్వో సభ్యులందరూ మే 3దాకా ఎక్కువ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు మార్చి 3 వరకే ఈ అవకాశం ఉండేది. అయితే దీన్ని రెండు నెలలపాటు ఈపీఎఫ్వో పొడిగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) యూనిఫైడ్ మెంబర్స్ పోర్టల్పై ఇటీవలే పెట్టిన యూఆర్ఎల్లో అధిక పెన్షన్ కోసం ఈ ఏడాది మే 3దాకా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఉద్యోగులు ఇందుకోసం అర్హత ఉన్నట్టయితే వారి సంస్థలతో కలిసి ఉమ్మడి దరఖాస్తు పెట్టుకోవచ్చని పేర్కొన్నది. అధిక పింఛన్ సదుపాయాన్ని ఎంచుకునేందుకు అర్హత ఉన్నవారికి 4 నెలలు సమయమివ్వాలని ఈపీఎఫ్వోను నిరుడు నవంబర్ 4న సుప్రీం కోర్టు ఆదేశించినది తెలిసిందే. దీని ప్రకారం ఈ శుక్రవారంతో గడువు తీరిపోతున్నది. ఈ క్రమంలోనే మరో 2 నెలల సమయాన్నిచ్చారు. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, కంపెనీలు కలిసి ఎలా దరఖాస్తు చేసుకోవాలో గత వారం ఈపీఎఫ్వో ప్రకటించిన సంగతి విదితమే. ఎంప్లాయీస్ పెన్షన్ (సవరణ) పథకం 2014ను గత ఏడాది అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 2014 ఆగస్టు 22న నెలసరి జీతం ఆధారంగా పెన్షన్కున్న అర్హత పరిమితిని రూ.6,500ల నుంచి రూ.15,000లకు సవరించినది తెలిసిందే. అలాగే ఈ పరిమితికి మించి తమ వాస్తవ వేతనాల్లో సంస్థతో కలిసి 8.33 శాతం ఈపీఎస్కు ఇచ్చేలా కూడా సభ్యులను అనుమతించారు.