న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో మార్చిలో ధరలు చుక్కలు తాకాయి. మార్చిలో దేశ టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం ఎనిమిదేండ్ల గరిష్టస్ధాయిలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకింది. ఇంధన, విద్యుత్ ధరలు పెను భారం కావడంతో మార్చిలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పైపైకి ఎగిసింది.
ఇక గత ఏడాది మార్చిలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ధరల భారం తక్కువగా ఉండటం గమనార్హం. కాగా గత మూడు నెలలుగా ధరల మంటతో టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం పెరుగుతోంది. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణంలో ఇంధన, విద్యుత్ ధరలు అంతకుముందు నెల 0.58 శాతం నుంచి 10.25 శాతానికి పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం 5.28 శాతం, తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.34 శాతానికి పెరగడంతో ధరలు చుక్కలు తాకాయి.