ముంబై, సెప్టెంబర్ 28: నొమురా ఇండియా వ్యాపార పునరుద్ధరణ సూచీ (బీఆర్ఐ) ఆల్టైమ్ హైకి చేరింది. మంగళవారం జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నొమురా తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్, పుణెల్లో అధిక రవాణా స్కోర్లు.. బీఆర్ఐని మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేర్చాయి. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో రవాణా జోరందుకున్నది. దీంతో వ్యాపార పునఃప్రారంభ కార్యకలాపాల సూచీ ఈ ఆదివారం (సెప్టెంబర్ 26)తో ముగిసిన వారంలో 105కు చేరింది. కరోనాకు ముందున్న స్థాయి (2020 మార్చి)ని ఇది దాటేయడం గమనార్హం. గూగుల్ మొబిలిటి సూచీలు, యాపిల్ డ్రైవింగ్ మొబిలిటి, పవర్ డిమాండ్, పెరిగిన కార్మికుల పని ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల వారపు కొలమానమే ఈ నొమురా ఇండియా బీఆర్ఐ. కరోనా తర్వాతి కాలంలో ఆర్థిక ప్రగతిని కొలిచే సాధనాల్లో ఇది కూడా ఒకటైంది.
పండుగ జోష్తో..
రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా ఈ అక్టోబర్-డిసెంబర్లో వినీమయం పెద్ద ఎత్తున పెరిగే అవకాశాలున్నాయని నొమురా తెలిపింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగుల డీఏ బకాయిల విడుదల కలిసిరాగలదని అభిప్రాయపడింది. అయితే రవాణా ఇబ్బందుల కారణంగా సమీప భవిష్యత్తులో తయారీ వృద్ధిరేటు ప్రభావితం కాగలదని అంచనా వేసింది.