కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ తాను రీకౌటింగ్కు ఆదేశిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని రిటర్నింగ్ ఆఫీసర్ ఓ వ్యక్తికి చెప్పినట్లు తనకు ఓ ఎస్సెమ్మెస్ వచ్చిందని మమత ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆడియోను కూడా ఆమె వినిపించారు. నాలుగు గంటల పాటు సర్వర్ డౌన్ అయింది. గవర్నర్ కూడా నాకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ సడెన్గా ఫలితం మారిపోయింది అని ఆమె అన్నారు.
ఎన్నికల సందర్భంగా బీజేపీ, కేంద్ర బలగాలు తమను ఎంతగానో వేధించాయని మమత చెప్పారు. అయితే ఎవరూ హింసకు పాల్పడకూడదని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆమె కోరారు. ప్రస్తుతం కొవిడ్పైనే తమ దృష్టంతా ఉన్నదని, ఈ మహమ్మారిపైనే తమ పోరాటమని మమత పదే పదే చెప్పారు.
దేశం మొత్తం ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని, దీని కోసం రూ.30 వేల కోట్ల కేటాయించాల్సిందిగా మమత కోరారు. కేవలం 2,3 రాష్ట్రాలకే కేంద్రం వ్యాక్సిన్లు, ఆక్సిజన్ను ఎక్కువగా పంపిణీ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఇక రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ కొవిడ్ వారియర్లుగా గుర్తిస్తున్నట్లు ఈ సందర్భంగా మమత స్పష్టం చేశారు.