Hero Moto Corp E-Scooter | దేశంలోనే అతిపెద్ద టూవీలర్ కంపెనీ హీరో మోటో కార్ప్స్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ డేట్ను వాయిదా వేసింది. తొలుత ఈ నెలాఖరులోగా విపణిలో ఆవిష్కరించాలని నిర్ణయించినా.. జూలైకి వాయిదా వేసింది. దీర్ఘకాలం మన్నిక ఉండేలా ఈ-స్కూటర్ను రూపొందిస్తున్నది. విదా బ్రాండ్ పేరుతో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూర్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నుంచి విపణిలోకి విడుదల చేయనున్నది. గతేడాది తన ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఈ-స్కూటర్లు టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ జెక్ ఎలక్ట్రిక్, ఒలా ఎస్1లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది.
దేశీయంగా విద్యుత్ వాహనాల చార్జింగ్ వసతుల కల్పనలోనూ హీరో మోటో కార్ప్ ముందు వరుసలో ఉంది. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థ.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తో కలిసి సంయుక్తంగా ఈవీ చార్జింగ్ వసతులను కల్పించనున్నది. తొలి దశలో ఢిల్లీ, ముంబైతోపాటు తొమ్మిది నగరాల పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రతి చార్జింగ్ స్టేషన్లోనూ డీసీ, ఏసీ చార్జర్లు లభ్యం కానున్నాయి. తదుపరి దశలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనున్నది.
బీపీసీఎల్తో కలిసి తాము ఏర్పాటు చేసే చార్జింగ్ స్టేషన్లు అన్ని టూ వీలర్స్కు అందుబాటులో ఉంటాయని హీరో మోటో కార్ప్ తెలిపింది. ప్రీమియం పోర్ట్ఫోలియో కింద పలు ఎలక్ట్రిక్ వాహనాలను విపణిలోకి తేవడంపై దృష్టి సారించింది. తమ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్ షేర్ పెంచుకోవడానికి దోహద పడతాయి. ఇప్పటికే ఎథేర్ ఎనర్జీ, గొగొరో సంస్థల్లో పెట్టుబడులు కొనసాగుతాయని సంస్థ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు.