న్యూఢిల్లీ, నవంబర్ 16: ద్విచక్ర వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ హీరో మోటోకార్ప్కు ప్రస్తుత పండుగ సీజన్ కలిసొచ్చింది. ఈ సీజన్లో ఏకంగా 14 లక్షల వాహనాలను విక్రయించి రికార్డు నెలకొల్పింది. ఒక పండుగ సీజన్లో ఇంతటి స్థాయిలో వాహనాలను విక్రయించడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
నవరాత్రి తొలిరోజు ప్రారంభమైన 32 రోజుల పండగ సీజన్ భాయ్ దూజ్(నవంబర్ 15న) ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు పలు నగరాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి విక్రయాల్లో 19 శాతం అధికంగా నమోదయ్యాయని హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా తెలిపారు. క్రితం ఏడాది పండుగ సీజన్లో సంస్థ 12.7 లక్షల యూనిట్ల వాహనాలను విక్రయించింది. మార్కెట్లోకి నూతన ఉత్పత్తులను విడుదల చేయడం, బ్రాండ్కు మరింత ప్రమోషన్ కల్పించడం, నూతన షోరూంలను ఏర్పాటు చేయడం ఇందుకు కలిసొచ్చిందన్నారు.
నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా వాహనాలు అమ్ముడయ్యాయని ఆయన చెప్పారు. ప్రధానంగా సానుకూల వర్షాలు కురియడం, పంటలు చేతికి రావడంతో ద్విచక్ర వాహనాలను అధికంగా కొనుగోళ్లు చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా నలు దిశలా అమ్మకాలు పెరిగాయని, ముఖ్యంగా దక్షిణ, ఉత్తర భారతంలో ఎక్కువగా వృద్ధి నమోదైందన్నారు. ఇక పండుగ సీజన్లోనే రిటైల్ సేల్స్ అధికంగా ఉంటాయని, మిగతా సీజన్లో అంతంత మాత్రంగానే ఉండనున్నాయని చెప్పారు.