Hero MotoCorp | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ సంస్థ హీరో మోటో కార్ప్.. కేంద్ర చమురు సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తో జత కట్టింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు రెండు సంస్థలు కృషి చేయనున్నాయి. ప్రస్తుతం విద్యుత్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతున్నది. ఎలక్ట్రిక్ వాహనాలదే ఫ్యూచర్ కావడంతో రెండు కంపెనీలు కలిసి దేశవ్యాప్తంగా టూ వీలర్ కంపెనీలకు చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతి కల్పిస్తాయి` అని ఎక్స్చేంజీ ఫైలింగ్లో హీరో మోటో కార్ప్ మంగళవారం తెలిపింది.
తొలుత ఎంపిక చేసిన నగరాల పరిధిలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. అటుపై దేశవ్యాప్తంగా కీలక మార్కెట్లుగా ఉన్న ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాయి. ప్రస్తుతం హెచ్పీసీఎల్ ఎనర్జీ స్టేషన్ల వద్ద చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కల్పిస్తాయి. అటుపై అనుబంధ బిజినెస్ అవకాశాల్లో పరస్పర సహకారంతో కలిసి పని చేస్తాయని హీరో మోటో కార్ప్ పేర్కొంది.
`మృదువుగా, శరవేగంగా విద్యుత్ వాహనాల వినియోగం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. అయితే, దేశవ్యాప్తంగా పబ్లిక్ చార్జింగ్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతులు కల్పించినప్పుడే కస్టమర్లు ఈవీ వెహికల్స్తో సౌలభ్యంగా వెళగలరని భావిస్తున్నాం. అందుకు హెచ్పీసీఎల్ సహకారంతో సుదీర్ఘ ప్రయాణం చేస్తాం` అని హీరో మోటో కార్ప్ సీఈవో కం చైర్మన్ పవన్ ముంజాల్ చెప్పారు.
తమ సంస్థకు 20 వేలకి పైగా ఔట్లెట్లు ఉన్నాయని హెచ్పీసీఎల్ సీఎండీ పుష్ప్ కుమార్ జోషి చెప్పారు. టూ వీలర్స్ సెగ్మెంట్లో బలంగా ఉన్న హీరో మోటో కార్ప్తో కలిసి దేశమంతా ఎలక్ట్రిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ కల్పించడానికి కృషి చేస్తాం అని అన్నారు.