Hero Moto Corp | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన వినియోగదారులకు బంఫర్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్ల అవసరాలకు సరిపడా ఈజీ ఫైనాన్సింగ్ ఆప్షన్లను తీసుకొచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతీయ మార్కెట్ల పరిధిలో ఎనిమిది కొత్త బైక్లు, స్కూటర్లను ఆవిష్కరించనున్నది. పండుగల సీజన్లో యూజర్లు కొత్త బైక్స్, స్కూటర్లు, మోపెడ్లు కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. వినియోగదారుల నుంచి వచ్చే గిరాకీని సొమ్ము చేసుకునేందుకు హీరో మోటో కార్ప్ ఎనిమిది కొత్త మోడల్ బైక్స్, స్కూటర్లు, మోపెడ్లు మార్కెట్లోకి తెస్తున్నది. వాటిల్లో ఎక్స్ట్రీం 106ఆర్ స్టెల్త్ 2.0 ఎడిషన్తోపాటు పాపులర్ మోడల్ బైక్స్ హెచ్ఎఫ్ సిరీస్, స్ప్లెండర్ +, గ్లామర్లను రీఫ్రెష్ చేసి, కొత్త కలర్ వేరియంట్లలో తేనున్నది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పండుగల సీజన్లో రిటైల్ మార్కెట్లో టూ వీలర్స్ సేల్స్ రికార్డులు నమోదు చేస్తాయని హీరో మోటో భావిస్తున్నది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో బైక్స్, స్కూటర్ల కోసం అద్భుతమైన డిమాండ్ ఉందని హీరో మోటో కార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్జిత్ సింగ్ చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత యావత్ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారని రంజీవ్జిత్ సింగ్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదేండ్లలో టూ వీలర్స్ సేల్స్ 33 శాతం పెరిగాయి.
దీంతో బైక్స్, స్కూటర్ల సేల్స్ పునరుద్ధరణ స్థాయికి చేరుకుంటున్నాయని రంజీవ్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఏప్రిల్- ఆగస్టు మధ్య 67 లక్షల టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. 2018-19లో 2.1 కోట్ల టూ వీలర్స్ అమ్ముడు పోయాయని తెలిపారు. గతేడాది 1.35 కోట్ల టూ వీలర్స్ అమ్ముడు పోయాయి. ఎంట్రీ లెవల్ బైక్స్, స్కూటర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. గత రెండేండ్లుగా బీఎస్-6 ప్రమాణాలను పాటిస్తూ టూవీలర్స్ తయారు చేయాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. కరోనా మహమ్మరి.. టూ వీలర్స్ సేల్స్ను దెబ్బతీసిందన్న విమర్శలు ఉన్నాయి.