న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్ కేసులో హీరో మోటోకార్ప్ చైర్మన్ పవన్ ముంజాల్కు చెందిన రూ. 24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సీజ్ చేసింది. ఢిల్లీలో ముంజాల్కు సంబంధించిన పాతిక కోట్ల విలువైన మూడు స్ధిరాస్తులను పీఎంఎల్ఏ నిబంధనల కింద స్వాధీనం చేసుకుంది. పవన్ ముంజాల్ సహా ఇతరులు భారత్ నుంచి విదేశీ నగదును అక్రమంగా తరలించారనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
భారత్ నుంచి రూ. 54 కోట్ల విలువైన విదేశీ నగదును నిందితులు తరలించారనే అభియోగాలు నమోదయ్యాయి. సవన్ ముంజాల్ ఇతరుల పేర్లతో విదేశీ ద్రవ్యాన్ని తరలించి ఆపై విదేశాల్లో ఆ మొత్తాన్ని తన వ్యక్తిగత ఖర్చుల కోసం వెచ్చించారని ఈడీ పేర్కొంది. పలువురు ఉద్యోగుల పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అధీకృత డీలర్ల నుంచి విదేశీ ద్రవ్యాన్ని డ్రా చేసి ఆపై ముంజాల్ రిలేషన్షిప్ మేనేజర్కు అందచేసినట్టు ఆరోపణలున్నాయి.
ఈ మొత్తాన్ని పవన్ ముంజాల్ వ్యక్తిగత, బిజినెస్ టూర్ల సందర్భంగా ఆయన వ్యక్తిగత ఖర్చుల కోసం వెచ్చించారు. ఈ ఏడాది ఆగస్ట్ 1న ఈడీ పవన్ ముంజాల్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టి రూ. 25 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలను డిజిటల్ ఆధారాలతో స్వాధీనం చేసుకుంది. దీంతో దర్యాప్తు సంస్ధ ఇప్పటివరకూ పవన్ ముంజాల్కు సంబంధించి రూ. 50 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లయింది.
Read More :