Elon Musk- Parag Agarwal | ఎలన్మస్క్.. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ కం మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ అధినేత. ట్విట్టర్ విషయంలో గానీ, టెస్లా కార్ల విషయంలో గానీ ఎలన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్న స్పెషలే.. కానీ.. ట్విట్టర్ టేకోవర్ ప్రక్రియ పూర్తవగానే.. నాటి సీఈఓగా ఉన్న భారత సంతతి ఐటీ నిపుణుడు పరాగ్ అగర్వాల్ను తొలగించేశారు. అటుపై కొంతకాలం ఎలన్ మస్క్.. ట్విట్టర్ సీఈఓగా వ్యవహరించారు. సంస్థ సీఈఓగా పరాగ్ అగర్వాల్ను తొలగించడానికి కారణాలు ఉన్నాయట.. ‘నిజంగా చాలా మంచి వ్యక్తి.. కానీ అది సరిపోదు.. పరాగ్ అగర్వాల్లో నాయకత్వ ప్రతిభ లేదు. దూకుడుగా నిర్ణయాలు తీసుకునే సీఈఓ ట్విట్టర్ కు అవసరం. కానీ పరాగ్ అగర్వాల్ అందుకు సరిపోరు’ అని ఎలన్ మస్క్ అన్నారట.
‘ట్విట్టర్ టేకోవర్’ విషయమై ఎలన్ మస్క్పై పాపులర్ బయోగ్రఫీ రైటర్ వాల్టర్ ఇసాక్సన్ రాసిన పుస్తకంలో ఈ సంగతులు ఉన్నాయి. ఈ నెల 12న ప్రచురితం కానున్న సదరు పుస్తకం గురించి వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్జే) ఓ వార్తా కథనం రాసింది. ట్విట్టర్ టేకోవర్ అంశం చర్చకు రాకముందు పరాగ్ అగర్వాల్, ఎలన్ మస్క్ మధ్య గతేడాది మార్చి 27న డిన్నర్ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత వారిద్దరూ మర్యాద పూర్వక సందేశాలు ఇచ్చుకున్నారు. పరాగ్ అగర్వాల్ తో భేటీ తర్వాత ఆయన మంచి వ్యక్తి అంటూనే.. అసహనం వ్యక్తం చేశారని, దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటేనే ట్విట్టర్ ముందుకు సాగుతుందన్నారు ఎలన్ మస్క్..
గతేడాది మార్చి 27న డిన్నర్ భేటీ తర్వాత ఎలన్ మస్క్.. ‘ట్విట్టర్ చనిపోతుందా’ అని ట్వీట్ చేశాడు. దానికి పరాగ్ అగర్వాల్ రియాక్టవుతూ.. ‘ట్విట్టర్’ను ఎలా డెవలప్ చేయాలో సుద్దులు చెప్పొద్దని వ్యాఖ్యానించారు. అలా మస్క్, పరాగ్ అగర్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం సాగింది. తొలుత ట్విట్టర్ టేకోవర్కు ముందుకు వచ్చిన ఎలన్ మస్క్.. తర్వాత వెనక్కి వెళ్లారు. ట్విట్టర్ న్యాయ పోరాటానికి దిగడంతో దాన్ని టేకోవర్ చేసిన ఎలన్ మస్క్.. వెంటనే పరాగ్ అగర్వాల్ తోపాటు పలువురు ఉద్యోగులను ఇంటికి సాగనంపారు.