HDFC Bank on Rs 2000 | మంగళవారం నుంచి తమ బ్యాంక్ శాఖల్లో ఖాతాదారులు తమ వద్ద ఉన్న రూ.2000కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయవచ్చునని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. వారు తమ ఖాతాల్లో రూ.2000 నోట్లు ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చునని పేర్కొంది. కానీ, రోజువారీ లిమిల్ ప్రకారం మంగళవారం నుంచి కేవలం రూ.20 వేల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది.
‘ఆర్బీఐ జారీ చేసిన రూ.2000కరెన్సీ నోటుపై ఎప్పటికప్పుడు మీకు అప్ డేట్ సమాచారం అందజేయాలని భావిస్తున్నాం. కస్టమర్ల విశ్వాసం పొందేందుకు వారికి సౌకర్యవంతమైన సేవలందించడమే మా తొలి ప్రాధాన్యం’ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన ఈ-మెయిల్ సందేశంలో వెల్లడించింది. రూ.2000 కరెన్సీ నోటును మార్కెట్లో చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆయా రూ.2000కరెన్సీ నోట్లను ఖాతాదారులు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడం గానీ, మార్చుకోవడం గానీ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వివరణ ఇచ్చింది.
రూ.2000 నోటు ఇక ముందు కూడా చెల్లుబాటవుతుంది. ఆర్థిక లావాదేవీలకు, చెల్లింపుల స్వీకరణకు దీన్ని అనుమతించవచ్చు.
వచ్చే సెప్టెంబర్ 30 వరకు ఖాతాదారులు తమ శాఖల్లో ఎంత మొత్తంలో రూ.2000 నోట్లు ఎటువంటి అవాంతరాలు లేకుండా స్వేచ్ఛగా డిపాజిట్ చేయొచ్చు.
ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ నిర్దేశిత లిమిట్ మేరకు ప్రతి రోజూ రూ.20 వేల విలువైన నోట్లు మార్చుకోవచ్చు.
అంతకుముందు ఎస్బీఐ కూడా రూ.2000 నోట్ల డిపాజిట్ లేదా మార్పిడిపై ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.2000 నోట్ల డిపాజిట్లకు ఎటువంటి పత్రం నింపాల్సిన అవసరం లేదు. పాన్ లేదా ఆధార్ కార్డు కూడా చూపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, డిపాజిట్లు రూ.50 వేలు దాటితే పాన్ కార్డు సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుందని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.