న్యూఢిల్లీ, జూన్ 1: సామాన్యుడిపై ఈఎంఐల భారం మరింత పడింది. రిజర్వుబ్యాంక్ గత నెలలో వడ్డీరేట్లను పెంచిన నాటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఒక్కొక్కటీ తమ వడ్డీరేట్లను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, బీవోబీ పలు ఇతర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీలు ఖాతాదారులకు షాకిచ్చాయి.
5 బేసిస్ పాయింట్లు పెంచిన హెచ్డీఎఫ్సీ
తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థయైన హెచ్డీఎఫ్ లిమిటెడ్ తాజాగా తన గృహాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్త కస్టమర్లతోపాటు పాత ఖాతాదారులు చెల్లించాల్సిన ఈఎంఐలు మరింత భారంకాబోతున్నాయి. గడిచిన నెలలోనే వడ్డీరేట్లను పెంచడం ఇది మూడోసారి. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా గృహ రుణాలపై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు(ఆర్పీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కొత్తగా రుణాలు తీసుకునేవారికి రుణ రేటు 7.05 శాతం నుంచి 7.50 శాతం వరకు ఉంటుది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీరేటు వర్తించనున్నది. గతంలో ఇది 7 శాతం నుంచి 7.45 శాతం మధ్యలో ఉన్నది.
పీఎన్బీ 15 బేసిస్ పాయింట్లు
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)..మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రుణ గ్రహితలపై ఈఎంఐ భారం పడనున్నది. ఈ రేట్లు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ని 7.25 శాతం నుంచి 7.40 శాతానికి పెంచింది. అలాగే ఒక్కరోజు, నెల, మూడు నెలల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్లు సవరించడంతో వరుసగా రేట్లు 6.75 శాతం, 6.80 శాతం, 6.90 శాతంగా ఉన్నాయి. అలాగే ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 7.10 శాతానికి పెంచింది.
ఐసీఐసీఐ బ్యాంక్ 30 బేసిస్ పాయింట్లు
ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 30 బేసిస్ పాయింట్లు పెంచేసింది. జూలై 2021 తర్వాత వడ్డీరేట్లను పెంచడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఏడాది క్రితం వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించింది. బ్యాంక్ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు నెల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.30 శాతానికి పెరిగింది.