న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రుణ గ్రహీతలకు మరోసారి షాకిచ్చింది. ఎంపిక చేసిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్ల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది. ఈ తాజా నిర్ణయంతో ఖాతాదారుల ఈఎంఐలు మరింత పెరగనున్నాయి. దీంతో ఒక్కరోజు రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరగడంతో రేటు 8.25 శాతం నుంచి 8.35 శాతానికి, నెల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరగడంతో రేటు 8.45 శాతానికి చేరుకున్నది. అంతకుముందు రేటు 8.30 శాతంగా ఉన్నది. అలాగే మూడు నెలల రుణాలపై రేటు 8.60 శాతం నుంచి 8.70 శాతానికి, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి సవరించింది. వీటితోపాటు ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 9.05 శాతం నుంచి 9.10 శాతానికి, రెండేండ్ల రుణాలపై రేటు 9.15 శాతానికి, మూడేండ్ల రుణాలపై రేటు 9.20 శాతానికి సవరించింది.