న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ మెరుగైన సామర్ధ్యం కనబరిచే ఉద్యోగులకు భారీ బహుమతులు, ప్రోత్సాహకాలను అందించేందుకు కసరత్తు సాగిస్తోంది. అట్రిషన్ నివారించేందుకు ఐటీ కంపెనీలు ప్రోత్సాహకాల బాటపట్టిన నేపథ్యంలో కంపెనీలో టాప్ పెర్ఫామర్లకు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఇవ్వాలని యోచిస్తున్నామని హెచ్సీఎల్ ఇటీవల ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై బోర్డు ఆమోదం తెలపాల్సి ఉందని కంపెనీ మానవవనరుల ముఖ్య అధికారి (సీహెచ్ఆర్వో) వీవీ అప్పారావు వెల్లడించారు.
రీప్లేస్మెంట్ హైరింగ్ వ్యయం 15 నుంచి 20 శాతం అధికంగా ఉన్నందున తమ సిబ్బందిలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. జావా డెవలపర్ను ప్రస్తుత ప్యాకేజ్లో తీసుకోవచ్చని, క్లౌడ్ ప్రొఫెషనల్స్ సేమ్ ప్యాకేజ్పై హైరింగ్ చేసుకోవడం సాధ్యం కాదని చెప్పారు. హెచ్సీఎల్లో మెరుగైన రిటెన్షన్ ప్యాకేజ్ ఉందని, ఏటా సీటీసీలో 50 నుంచి 100 శాతం నగదు ఇన్సెంటివ్ స్కీమ్ ఆఫర్ చేస్తున్నామని అన్నారు. దీని ద్వారా నాయకత్వ బృందాల్లో కీలక నైపుణ్యాలు కలిగిన 10 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.