న్యూఢిల్లీ : దేశ ఉత్పాదకతను పెంచేందుకు యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి పిలుపు ఇవ్వడంపై హాట్ డిబేట్ సాగుతోంది.నారాయణమూర్తి వ్యాఖ్యలను కొందరు స్వాగతించగా మరికొందరు ఆయన అభిప్రాయంతో విభేదించారు. ఈ విషయంపై ప్రముఖ బిజినెస్ లీడర్లు సైతం తలోరకంగా స్పందిస్తున్నారు. ఇక ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయంకా (Harsh Goenka) ఈ అంశంపై స్పందిస్తూ ఉత్పాదకతను పనిచేసే గంటలతో కొలవడం సరైంది కాదని తోసిపుచ్చారు.
50 గంటలా లేదా 70 గంటలు పనిచేయడమా అనేది ప్రాధాన్యత కాదని, అంతకుమించి మీ సంకల్పం, ఉద్దేశం, మీ ఉత్పాదకత కీలకమని ఆయన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. సంప్రదాయ వారానికి ఐదు రోజుల పని వ్యవస్ధకు కాలం చెల్లిందని, ఇక రాబోయే రోజుల్లో, భవిష్యత్లో హైబ్రిడ్ వర్క్ మోడల్దే హవా అని పేర్కొన్నారు. కాగా, ఇన్ఫోసిస్ వ్యవస్దాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ చీఫ్ సజ్జన్ జిందాల్ వంటి కొందరు వ్యాపారవేత్తలు నారాయణమూర్తి ఆలోచనను సమర్ధించగా ఎక్కువ గంటలు నిర్విరామంగా పనిచేస్తే ఉద్యోగులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని పలువురు ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.
భారత మహిళలు దశాబ్ధాలుగా వారానికి 70 గంటల కంటే ఎక్కువే పనిచేస్తున్నారని, ఈ విషయంపై ఎవరూ దృష్టి సారించడం లేదని ఎడల్వీస్ మ్యూచ్వల్ ఫండ్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాధికా గుప్తా పేర్కొన్నారు.
అటు ఆఫీస్ పనులతో పాటు ఇటు ఇంటి పనిని చక్కబెడుతూ భారత్ నిర్మాణానికి, రాబోయే తరం భారతీయులను తీర్చిదిద్దేందుకు భారత మహిళలు వారానికి 70 గంటల కంటే అధికంగా శ్రమిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏండ్లుగా, దశాబ్ధాలుగా చిరునవ్వుతో ఎలాంటి ఓవర్టైం డిమాండ్ చేయకుండా మహిళలు పనిచేస్తున్నారని రాధికా గుప్తా గుర్తుచేశారు. ట్విట్టర్లో మా గురించి ఎవరూ చర్చించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో రాధికా గుప్తా పోస్ట్కు ఇప్పటివరకూ 74,000కుపైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో యూజర్లు రియాక్టయ్యారు. భారతీయ మహిళల అలుపెరుగని శ్రమకు గుర్తింపు నోచుకోవాలని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
Sim Swapping | సిమ్ స్వాపింగ్ స్కామ్తో జాగ్రత్త.. ఏమిటీ మోసం..?