న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: బంగారు నగలు, కళాఖండాలకు సంబంధించి తప్పనిసరి హాల్మార్కింగ్ను దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని మరో 55 జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శుక్రవారం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఇందులో తెలంగాణలోని 4 జిల్లాలున్నాయి. వీటిలో మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో తప్పనిసరి గోల్డ్ హాల్మార్కింగ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, దశలవారీగా దేశంలో తప్పనిసరి గోల్డ్ హాల్మార్కింగ్ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న సంగతి విదితమే.
2021 జూన్ 23న తొలి దశ కింద 256 జిల్లాల్లో, 2022 ఏప్రిల్ 4న రెండో దశ కింద 32 జిల్లాల్లో ఈ నిబంధనల్ని తీసుకొచ్చిన కేంద్రం.. తాజాగా మూడో దశ కింద 55 జిల్లాల్లో అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా 343 జిల్లాల్లో తప్పనిసరి గోల్డ్ హాల్మార్కింగ్ అమల్లోకి వచ్చినైట్టెంది. ఫలితంగా ఆభరణాలు, కళాఖండాలపై హాల్మార్క్ ఉంటేనే ఈ జిల్లాల్లో క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. లేకపోతే జరిమానాలు, శిక్షలు తప్పవు. నిజానికి 2021 జూన్ 16 వరకు గోల్డ్ హాల్మార్కింగ్ అనేది తప్పనిసరేమీ కాదు. స్వచ్చంధమే. అయితే బంగారం స్వచ్ఛతను ధ్రువీకరించే ఈ హాల్మార్క్ను తప్పనిసరి చేస్తూ.. దశలవారీగా దీన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2021 జూన్ 23 నుంచి హాల్మార్క్ను దేశంలోని మూడింటా ఒక వంతు జిల్లాల్లో తప్పనిసరి చేసింది. దీనివల్ల మోసాలను అడ్డుకోవచ్చని, వినియోగదారులు నష్టపోకుండా ఉంటారని అంటున్నది.
తెలంగాణలోని 4 జిల్లాలతోపాటు బీహార్లోని 8 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఐదేసి జిల్లాల్లో, హర్యానా, జమ్ముకశ్మీర్, పంజాబ్, కర్నాటక, తమిళనాడుల్లో మూడేసి జిల్లాల్లో, అస్సాం, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్లో రెండేసి జిల్లాల్లో, రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో మూడో దశ కింద తప్పనిసరి గోల్డ్ హాల్మార్కింగ్ను అమల్లోకి తెచ్చారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ద్వారా ఈ ప్రక్రియ సాగుతున్నదన్నది తెలిసిందే.