ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు నిర్ణయం గట్టిగానే ప్రభావితం చేయవచ్చనిపిస్తున్నది. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో లాభాల స్వీకరణకు ఆస్కారం ఉందనే చెప్పవచ్చు. నిజానికి సూచీల అప్ట్రెండ్కు గతవారం చివరి రోజునే బ్రేకులుపడ్డాయి. మదుపరులు అమ్మకాలకే పెద్దపీట వేశారు. అయినప్పటికీ అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారంలోనూ సూచీలు పుంజుకున్నాయి.
ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 721.53 పాయింట్లు పెరిగి 82,626.23 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 213.05 పాయింట్లు కోలుకుని 25,327.05 దగ్గర నిలిచింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల నిర్ణయంతో ఈ వారం మార్కెట్లపై సెల్లింగ్ ప్రెషర్ ఉండవచ్చన్న అంచనాలైతే వినిపిస్తున్నాయి. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ముఖ్యమే.
కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,000 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,800 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,600-25,800 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు. జీఎస్టీ ఉత్సాహం కనిపిస్తే ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించవచ్చు.
గమనిక: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.