Gautam Adani | భారత్, ఆసియా కుబేరుడు గౌతం అదానీ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే రూ.48.600 (600 కోట్ల డాలర్లు) కోట్ల మేరకు తుడిచి పెట్టుకు పోయింది. అదానీ గ్రూప్లోని ఏడు లిస్టెడ్ కంపెనీల స్టాక్స్, బాండ్లు మూడు నుంచి ఏడుశాతం నష్టపోయాయి. ప్రస్తుతం అదానీ వ్యక్తిగత సంపద 113 బిలియన్ డాలర్లు. అదానీ గ్రూప్ సంస్థ షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని, అకౌంట్స్లోనూ మోసాలకు పాల్పడుతున్నదని అమెరికా కేంద్రంగా పని చేస్తున్న హిడెన్బర్గ్ అనే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో బుధవారం అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. గణనీయంగా రుణాలు తీసుకున్న అదానీ గ్రూప్ పూర్తిగా `ఆర్థిక అనిశ్చిత స్థితి`లోకి నెట్టివేయబడుతున్నదని కూడా హిడెన్బర్గ్ పేర్కొంది.
శుక్రవారం నుంచి ఈనెల 31 వరకు అదానీ గ్రూప్ రూ.20 వేల కోట్ల నిధుల సేకరణకు ఫాలోఅన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కు వెళ్లనున్న నేపథ్యంలో హిడెన్బర్గ్ నివేదిక బహిర్గతం కావడం ఆసక్తికర పరిణామం. ఎఫ్పీవోలో గ్రూప్ స్టాక్స్ ప్రైస్ బ్రాండ్ రూ.3112 నుంచి రూ.3276 మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఎఫ్పీవో నేపథ్యంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,985 కోట్ల పెట్టుబడులు సేకరించినట్లు అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ బుధవారం ప్రకటించింది.
దేశంలో అత్యధిక పోర్ట్లు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ (60) అహ్మదాబాద్ కేంద్రంగా పని చేస్తున్నారు. ఆయన సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలు దేశంలో థర్మల్ బొగ్గు ఉత్పత్తిదారు & విక్రేత కూడా. దేశంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్న సంస్థ. ఇన్ఫ్రాతోపాటు కమొడిటీస్, రియల్ ఎస్టేట్, విద్యుత్ ఉత్పత్తి & పంపిణీ రంగాల్లో 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సముపార్జిస్తున్నది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్స్ సంస్థలో గౌతం అదానీ వాటా 75 శాతం అని గతేడాది మార్చిలో స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్లో తెలిపారు. అదానీ టోటల్ గ్యాస్లో 37 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్లో 65, అదానీ గ్రీన్ ఎనర్జీలో 61 శాతం వాటా గౌతం అదానీ కలిగి ఉన్నారు.
అదానీ గ్రూప్ స్టాక్స్ రూ.48 వేల కోట్ల మేరకు పతనం కాకముందు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 120 బిలియన్ డాలర్లు. అందులో గత మూడేండ్లలోనే 100 బిలియన్ డాలర్ల సంపద కూడబెట్టారు. అదానీ గ్రూప్లోని ఏడు లిస్టెడ్ కంపెనీలు సరాసరి 819 శాతం లబ్ధి పొందాయి. పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండే మారిషస్, కరేబియన్, యూఏఈ దేశాల్లో షెల్ కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా అదానీ కుటుంబం ఆదాయం సంపాదిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల నుంచి సదరు షెల్ కంపెనీలకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తుందని సమాచారం.
అదానీ గ్రూప్పై హిడెన్ బర్గ్ కీలక వ్యాఖ్యలే చేసింది. `మా నివేదికను పట్టించుకోకుండా అదానీ గ్రూప్ సంస్థల ఆర్థిక ఫలితాలను, షేర్ విలువలను పరిశీలించండి. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల ఇన్వెస్ట్మెంట్ మూలాలు 85 శాతం దిగువన ఉన్నాయి. కానీ వాటి షేర్లు ఆకాశంలోకి దూసుకెళ్తున్నాయి. పెరిగిన షేర్ విలువను తాకట్టు పెట్టి అదానీ గ్రూప్ భారీగా రుణాలు తీసుకుంటున్నది` అని హిడెన్ బర్గ్ స్పష్టం చేసింది. గత సెప్టెంబర్లో ఫిచ్ రేటింగ్స్ అనుబంధ క్రెడిట్ సైట్స్ కూడా అదానీ గ్రూప్ సంస్థల భారీ రుణాలు ఆందోళనకరం అని వ్యాఖ్యానించింది.
అదానీ గ్రూప్లో పని చేసిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, పలువురు వ్యక్తులతో చర్చించి ఈ నివేదిక రూపొందించామని హిడెన్బర్గ్ తెలిపింది. ఆ సంస్థకు చెందిన పత్రాలు సునిశితంగా పరిశీలించాక, ఆరు దేశాల్లో లిస్టెడ్ సంస్థల ఆఫీసులను పరిశీలించాకే తమ నివేదిక వెల్లడైందని వివరించింది.
హిడెన్బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ రియాక్టయింది. హిడెన్బర్గ్ నివేదిక పూర్తిగా తమ సంస్థపై ద్వేషంతో రూపుదిద్దుకున్నది. నిరాధారమైన ఏకపక్ష ఆరోపణలు. మా కంపెనీ షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో ఈ నివేదిక వెల్లడించారు. మమ్ముల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నివేదిక వెల్లడించడం దిగ్భ్రాంతికరం` అని వ్యాఖ్యానించింది. ఇంతకుముందు ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ జెఫ్ బెజోస్ మూడో స్థానానికి దూసుకెళ్లగా, గౌతం అదానీ ఒక మెట్టు దిగి నాలుగో స్థానానికి చేరుకున్నారు. అమెరికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ `హిడెన్బర్గ్`పై అమెరికా, భారత్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.