న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ లక్నోలో శుక్రవారం సమావేశం కానుంది. కొవిడ్-19 చికిత్సలో వాడే అత్యవసరాలపై విధించే సుంకాలపై మినహాయింపుల పొడిగింపుపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
దేశవ్యాప్తంగా రికార్డు ధరలతో భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ రేట్లకు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే పరిష్కారంగా భావిస్తున్నా ఈ చర్యతో ప్రభుత్వాలకు వాటిల్లే ఆదాయ నష్టం ఎలా భర్తీ చేసుకోవాలనే దిశగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కసరత్తు సాగిస్తారని సమాచారం. ఇక పెట్రోల్, డీజిల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఓ పిటిషన్ విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు ఈ ఏడాది జూన్లో జీఎస్టీ కౌన్సిల్ను కోరింది.