న్యూఢిల్లీ, జనవరి 31: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరి నెలలో రూ.1.72 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తాజాగా వెల్లడించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంతటి స్థాయిలో వసూలవడం ఇది రెండోసారి కాగా, అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్ల కంటే అధికంగా నమోదవడం ఇది మూడోసారి.
క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,55,922 కోట్లతో పోలిస్తే 10.4 శాతం అధికమయ్యాయని పేర్కొంది. జనవరి 31, సాయంత్రం 5 గంటల వరకు రూ.1,72,129 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జనవరి వరకు రూ.16.69 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయ్యాయి.