ముంబై: దేశంలో మరోసారి భారీగా వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలకుగానూ మొత్తం రూ.1,51,718 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అందులో సీజీఎస్టీ రూ.26,039 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.33,396 కోట్లుగా కేంద్రం వెల్లడించింది. ఇక ఐజీఎస్టీ కింద రూ.81,778 కోట్లు వసూలయ్యాయని, రూ.10,505 కోట్లు సెస్సుల రూపంలో వచ్చాయని చెప్పింది.
గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ అక్టోబర్ వసూళ్లలో 16.6 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత అక్టోబర్లో రూ.1.30 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయని తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా గత ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల జీఎస్టీ వసూలైందని, ఈ నెల వసూలైన రూ.1.51 లక్షల కోట్ల పైచిలుకు జీఎస్టీ రెండో అత్యధికమని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీలో గత ఏడాది అక్టోబర్లో రూ.2,879 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరగ్గా.. ఈ ఏడాది రూ.3,579 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 24% వృద్ధి నమోదైంది. తెలంగాణలో గత ఏడాది అక్టోబర్లో రూ.3,854 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది 11 శాతం వృద్ధితో రూ.4,284 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది.