న్యూఢిల్లీ, మార్చి 1: జీఎస్టీ వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెలకుగాను రూ.1,68,337 కోట్ల మేర పన్ను వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలైన వసూలైన రూ.1.51 లక్షల కోట్లతో పోలిస్తే 12.5 శాతం అధికమని పేర్కొంది. దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం అధికమవగా, దిగుమతైన వస్తువులపై వసూలయ్యే జీఎస్టీ 8.5 శాతం వృద్ధి కారణంగా వసూళ్లకు వృద్ధికి దోహదం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. వరుసగా నాలుగో నెల రూ.1.6 లక్షల కోట్ల అధికంగా నమోదవడం ఇది తొలిసారి కావడం విశేషం. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత గరిష్ఠంగా ఏప్రిల్ 2023లో రూ.1.87 లక్షల కోట్లు వసూలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో రూ.1.74 లక్షల కోట్లు, అక్టోబర్ 2023లో రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 11.7 శాతం పెరిగి రూ.18.40 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సరాసరిగా ఒక్కో నెలలో రూ.1.67 లక్షల కోట్లుగా వసూలయ్యాయి.
తెలంగాణలో 5,211 కోట్లు
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగాయి. ఏడాది క్రితం రూ.4,424 కోట్లుగా ఉన్న వసూళ్లు ఈ ఏడాది అదే నెలలో రూ.5,211 కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే ఆంధ్రప్రదేశ్లోనూ వసూళ్లు 3 శాతం పెరిగి రూ.3,678 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇది రూ.3,557 కోట్లుగా ఉన్నాయి.