GST Collection | అక్టోబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. దాదాపు రూ.1.95లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లయ్యాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 4.6శాతం పెరిగాయి. 2024 అక్టోబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.87లక్షలుగా ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ (CGST), స్టేట్ జీఎస్టీ (SGST), ఇంటిగ్రేటెడ్ GST (IGST) అన్నీ అక్టోబర్ నెలలో వృద్ధిని నమోదు చేయగా.. సెస్ వసూళ్లు మాత్రం తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) మొత్తం జీఎస్టీ వసూళ్లు 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2017లో జీఎస్టీని అమలు చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం.
భారత జీఎస్టీ వ్యవస్థ 2024-25లో రూ.22.08 లక్షల కోట్ల రికార్డు స్థూల వసూళ్లతో మైలురాయిని సాధించింది. ఇదిలా ఉండగా.. అక్టోబర్ నెలలో జీఎస్టీ రూ.1.87 లక్షల కోట్లు వసూలు జరిగాయి. ఆ మొత్తం 1.96 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మొత్తం రూ.1.86 లక్షలు కోట్లు వసూలవగా.. సెప్టెంబర్లో 1.89 లక్షలు కోట్లుగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. గతేడాదితో పోల్చినప్పుడు 4.6 శాతం వృద్ధి నమోదైంది. అయితే, గడిచిన నెలలతో పోల్చి చూస్తే సగటున 9 శాతం వృద్ధి కంటే తక్కువ నమోదైంది. అక్టోబర్ జీఎస్టీ వసూళ్లలో రూ.1.45 లక్షల కోట్లు దేశీయ వినియోగం నుంచి.. దిగుమతులపై సుంకాల ద్వారా రూ.50,884 కోట్లు వచ్చాయి. జీఎస్టీ రిఫండ్స్ రూ.26,934 కోట్లు మినహాయిస్తే.. నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.69 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. దసరా సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. చాలా వస్తువులపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. దాంతో దసరా నవరాత్రి, దీపావళి దీపావళి సమయంలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. జీఎస్టీ రేట్ల సవరణ తర్వాత వినియోగదారుల నుంచి డిమాండ్ కనిపించిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది వినియోగం మరో పదిశాతానికిపైగా పెరిగే అవకాశాలున్నాయి. దాంతో అదనంగా రూ.20లక్షల కోట్ల మేర కొనుగోళ్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. పండగ సీజన్లో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్, పన్ను విధానం, పెరుగుతున్న వినియోగం జీఎస్టీ వసూళ్లు పెరిగేందుకు కారణమని వినియోగం, పన్ను చెల్లింపులు సరైన దిశలో సాగుతున్నాయనేందుకు ఇది సానుకూలమని సూచికని కేపీఎంజీ ఇండియా భాగస్వామి అభిషేక్ జైన్ పేర్కొన్నారు.