ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి. అప్పుడే ఆ దేశం సమ్మిళిత ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది. అయితే, గడిచిన పదేండ్లలో భారత్ ఈ అంశాల్లో ఏ కొశానా వృద్ధి నమోదు చేయలేదు. ఆసియాలోని ప్రధాన దేశాలకు ఏ రకంగానూ పోటీనివ్వలేదు. తొమ్మిదేండ్లలో బీజేపీ సర్కారు సాధించిన ఘనత ఇది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ‘అచ్ఛేదిన్’ తీసుకొస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దేశాన్ని అధోగతిపాల్జేసి ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. దేశ ప్రగతికి సూచికలుగా భావించే ఐదు కీలక అంశాలైన జీడీపీ వృద్ధిరేటు, తలసరి ఆదాయం, ఎగుమతులు, జీడీపీలో తయారీరంగం వాటా, నిరుద్యోగిత రేటులో మిగతా ఆసియా దేశాలతో పోలిస్తే, భారత్ అట్టడుగు స్థానాల్లో నిలిచింది. ఈ మేరకు గడిచిన పదేండ్ల గణాంకాలను విశ్లేషిస్తే అర్థమవుతున్నది.
జనాభా విషయంలో భారత్లో 14వ వంతు కూడా లేని చిన్న దేశం వియత్నాం.. జీడీపీ వృద్ధిరేటులో మనకంటే ఎంతో ముందున్నది. చైనా బెదిరింపులతో నిత్యం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న తైవాన్ తలసరి ఆదాయంలో భారత్కు అందనంత ఎత్తులో ఉన్నది. కరోనా సంక్షోభం, లాక్డౌన్ ప్రభావం చూపినప్పటికీ ఎగుమతుల్లో చైనా చూపించిన దూకుడును భారత్ అందుకోలేకపోయింది. ఇక, భారత జీడీపీలో తయారీ రంగం వాటా ఏకంగా 1.3 శాతం పడిపోయింది. నిరుద్యోగం పెచ్చరిల్లుతున్న ఆసియా దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. థాయిలాండ్తో పోలిస్తే, భారత్లో నిరుద్యోగం 8 రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
దశాబ్దకాలంలో డీలాపడిన ఎగుమతులు
ఎగుమతులు ఎక్కువగా ఉన్న దేశం ఆర్థికంగా పుష్టిగా ఉంటుందంటారు. ఎగుమతులకు సంబంధించి 9 ఆసియా దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానానికి పరిమితమైంది. తొలి ఐదేండ్లతో పోలిస్తే, మలి ఐదేండ్లలో భారత్ ఎగుమతుల్లో తగ్గుదల నమోదైంది. వియత్నాం ఈ క్యాటగిరీలో తొలిస్థానంలో ఉండగా, మలేషియా, చైనా, తైవాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2022లో భారత్ తలసరి ఆదాయం (డాలర్లలో)
ఒక వ్యక్తి ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని తలసరి ఆదాయంగా చెబుతారు. 2.3 కోట్ల జనాభా ఉన్న చిన్న దేశం తైవాన్ తలసరి ఆదాయం రూ. 27 లక్షలుగా ఉంటే, భారత్లో ఒక్కొక్కరి ఆదాయం రూ. 2 లక్షలకే పరిమితమైంది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న తొమ్మిది ఆసియా దేశాల జాబితాలో భారత్ చిట్టచివరి స్థానంలో నిలిచింది.
జీడీపీలో వియత్నాం, చైనాకంటే భారత్ వెనుకంజ
పనిచేయగలిగే శ్రామికశక్తికి తగిన అవకాశాలు లభిస్తే ఉత్పాదకత పెరుగుతుంది. అది జీడీపీ వృద్ధిరేటుకు బాటలు వేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన భారత్ వంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే చిన్న దేశం వియత్నాం వృద్ధిరేటు ఎంతో ఎక్కువగా ఉన్నది. వియత్నాంతో పోలిస్తే, భారత్లో శ్రామికశక్తి 17 రెట్లు ఎక్కువ. అయినప్పటికీ జీడీపీ వృద్ధిరేటులో భారత్ కంటే వియత్నాం ఎంతో మెరుగ్గా ఉన్నది. దాదాపు మన దేశంతో సమానమైన జనాభా కలిగిన చైనా జీడీపీ వృద్ధిరేటు కూడా భారత్ కంటే ఎక్కువే.
దశాబ్దకాలంలో జీడీపీలో తయారీరంగం వాటా తగ్గిందిలా..
‘మేకిన్ ఇండియా’ పేరిట ప్రచారానికే పరిమితమైన బీజేపీ సర్కారు తయారీరంగాన్ని పట్టించుకోలేదు. దీంతో ఎన్నో పరిశ్రమలు మూతబడ్డాయి. ఫలితంగా 2012లో జీడీపీలో 15.8 శాతం వాటా కలిగిన తయారీరంగం.. 2022 నాటికి 14 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో తయారీరంగంలో వియత్నాం, మలేషియా వంటి చిన్న దేశాలు దూసుకుపోతున్నాయి.
గరిష్ఠస్థాయిలోనే భారత్లో నిరుద్యోగం
దేశంలో ఇప్పటికిప్పుడు ఉద్యోగం కావాల్సినవారు 22 కోట్ల మంది ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీన్ని ధ్రువపరుస్తూ.. తొమ్మిది ఆసియా దేశాల్లో నిరుద్యోగిత రేటులో భారత్ టాప్ ప్లేస్లో ఉన్నది. దేశంలో నిరుద్యోగిత రేటు 7.9 శాతంగా ఉంటే, థాయిలాండ్లో ఇది కేవలం 0.9 శాతమే.