న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ సోమవారం అంచనా వేసింది. ‘ప్రస్తుతం ఇండ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో స్పష్టమైన డిమాండ్ కనిపిస్తున్నది. అందువల్ల ధరలు నిలకడగా ఉండటమేగాక, పెరగడం ఖాయమనిపిస్తున్నది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె తదితర నగరాల్లో దాదాపు 8 శాతం వృద్ధి ఉండవచ్చు’ అని ఓ ప్రకటనలో ఇండియా రేటింగ్స్ తెలియజేసింది.
కరోనా నేపథ్యంలో చాలాకాలం ధరలు క్షీణించాయని, మార్కెట్లో స్తబ్ధత నెలకొన్నదన్న ఇండియా రేటింగ్స్.. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ధరలు 6 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇకపోతే ఇండ్ల అమ్మకాలు సైతం సుమారు 12 శాతం పెరగవచ్చని పేర్కొన్నది. గత ఆర్థిక సంవత్సరం హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో హౌజింగ్ సేల్స్ 42 శాతం పెరిగినట్టు చెప్పింది. ఇదిలావుంటే 2006 నుంచి భారతీయ రియల్ ఎస్టేట్ 62.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.81 లక్షల కోట్లు) సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది.