GST Collections | జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. రూ.2.37లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. గత మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు 1.96లక్షల కోట్లు వసూలైన విషయం తెలిసిందే. గతేడాది ఏప్రిల్ నెలలో వసూళ్లు రూ.2.10 లక్షల కోట్లుగా ఉన్నది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 2017 జులై ఒకటి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన నెలగా ఏప్రిల్-2025 రికార్డులకెక్కింది. ఇక గతేడాది ఏప్రిల్తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం మేర పెరగడం విశేషం. ఏప్రిల్ నెలలో మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.9 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయని కేంద్రం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.
గతేడాదితో పోలిస్తే మొత్తం 10.7శాతం పెరిగింది. దిగుమతైన వస్తువులపై వేసే జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 20.8 శాతం పెరిగి రూ.46,913 కోట్లకు చేరింది. రూ.27,341 కోట్ల రిఫండ్లు జారీ అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అయితే, రీఫండ్స్ 48.3శాతం ఎక్కువగా ఉండడంతో నికర ఆదాయం 9.1శాతం తగ్గింది. త్రైమాసిక వసూళ్లలో 10.4 శాతం వృద్ధి నమోదవగా.. 2025 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నమోదైన 8.3 శాతం వృద్ధి కంటే చాలా ఎక్కువ. ఏప్రిల్ నెలలో వసూళ్లు రూ.1.8 లక్షల కోట్ల మార్క్ దాటడం ఇది వరుసగా నాలుగోసారి.