Nitin Gadkari – Fastag | జాతీయ రహదారులపై వెళుతున్న వాహనాల యజమానులు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఫిజికల్గా టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు పే చేసేవారు. తర్వాత ట్రాఫిక్ జామ్ నివారణకు ఫాస్టాగ్ (Fastag) విధానం తీసుకొచ్చారు. కానీ, త్వరలో మరో విధానం అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (GPS Based Electronic Toll Collection System) అమల్లోకి రానున్నది. ఈ విషయమై కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంకేతాలిచ్చారు.
2024 లోక్సభ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంపీసీ) అమల్లోకి రాక ముందే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ అమల్లోకి రాబోతున్నదని శుక్రవారం నితిన్ గడ్కరీ చెప్పారు. ఇందుకోసం కన్సల్టెంట్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
2021 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లింపుల విధానం అమల్లోకి వచ్చింది. ఒకవేళ ఫాస్టాగ్ లేకపోతే జరిమానాగా డబుల్ టోల్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. మూడేండ్ల ఫాస్టాగ్ విధానం అమలు చేసిన తర్వాత దశల వారీగా జీపీఎస్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అమల్లోకి తేవడానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఆర్ఎఫ్ఐడీ బేస్డ్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు.