న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మినహాయింపుల్లేని ఆదాయపు పన్నుల వ్యవస్థను తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు.వ్యక్తిగత ఆదాయపు పన్ను కొత్త పద్ధతిలో పలు మార్పుల్ని కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన నేపథ్యంలో మల్హోత్రా పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వం సరళమైన, మినహాయింపులేవీ లేకుండా తక్కువ రేట్లతో కూడిన పన్నుల వ్యవస్థను క్రమేపీ తీసుకొస్తుందన్నారు. పాత పద్ధతిలో రూ. 2 లక్షలకుపైగా పలు రకాల మినహాయింపులు, రూ. 50,000 స్టాండర్డ్ డిడెక్షన్ను ఇస్తుండగా, గత ఏడాది ప్రవేశపెట్టిన కొత్త పద్దతిలో మినహాయింపులు ఏవీ ఉండవు. పన్ను రేట్లు తక్కువ. కానీ మధ్యతరగతి వేతన జీవులకు పాతపద్ధతిలోనే మొత్తంమీద పన్ను తక్కువ పడుతున్నందున, కొత్త పద్ధతిలో రిటర్న్లు చేసే వారు కరువయ్యారు. దీంతో బుధవారంనాటి బడ్జెట్లో పాత పద్ధతిని ఏమీ టచ్ చేయకుండా, కొత్త విధానంలో పన్ను ఆదాయ పరిమితిని రూ.7 లక్షలకు పెంచడంతో పాటు రూ. 50 వేల స్టాండర్డ్ డిడెక్షన్ సైతం కల్పించారు.
పన్ను శ్లాబుల్లో పలు మార్పులు చేశారు. పొదుపును ప్రోత్సహించే పన్ను మినహాయింపులను ఇచ్చే పాత పద్ధతిని ప్రభుత్వం ఒకటి, రెండు సంవత్సరాల్లో ఎత్తివేస్తుందని, పొదుపు, మినహాయింపుల రహిత కొత్త వ్యవస్థలోకి పన్ను చెల్లింపుదార్లను లాగుతుందన్న అనుమానాల్ని విశ్లేషకులు వ్యక్తం చేశారు. ఈ అనుమానాలనే గురువారం రెవెన్యూ కార్యదర్శి పరోక్షంగా ధృవీకరించారు. రెవెన్యూ శాఖ విశ్లేషణ ప్రకారం రూ.15 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తి కనీసం రూ.3.75 లక్షల మినహాయింపుల్ని క్లెయిం చేస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు.
తప్పనిసరిపై నిర్ణయం తీసుకోలేదు
పన్ను చెల్లింపుదార్లకు కొత్త విధానాన్ని ఎప్పటినుంచి తప్పనిసరి చేయాలన్న అంశమై నిర్దేశిత సమయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని రెవెన్యూ కార్యదర్శి వెల్లడించారు. ‘మేము తక్కువ పన్ను రేట్లతో కూడిన, సరళమైన, ఎటువంటి పన్ను మినహాయింపులు లేని వ్యవస్థవైపు ప్రయాణిస్తున్నాం’ అని చెప్పారు. ఈ దిశగానే కొత్త రిజీమ్లో రూ.7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను లేకుండా బడ్జెట్లో ప్రతిపాదించారని, దీనికి తోడు రూ 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఆఫర్ చేసినట్టు మల్హోత్రా వివరించారు. దీంతో రూ. 7.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించనక్కర్లేదన్నారు.
స్టాండర్డ్ డిడక్షన్ ఇప్పటివరకూ పాత పద్ధతిలోనే ఉంది. తాజా ప్రతిపాదనలతో పెట్టుబడులపై మినహాయింపులు లేని కొత్త పద్ధతి పట్ల వేతన జీవులు ఆకర్షితులవుతారని భావిస్తున్నామని రెవిన్యూ కార్యదర్శి చెప్పారు. 2020-21 బడ్జెట్లో కొత్త పద్ధతిని తొలిసారి ప్రవేశపెట్టిన నరేంద్ర మోది ప్రభుత్వం తాజాగా ట్యాక్స్పేయర్లను ఆకట్టుకునేందుకు పన్ను మినహాయింపు ఆదాయ పరిమితిని పెంచడంతో పాటు పన్ను రేట్లను, శ్లాబుల్ని సవరించింది.రెవెన్యూ శాఖ విశ్లేషణ ప్రకారం రూ.10 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తులు, కొత్త రిజీమ్తో సమానంగా పన్ను తగ్గించుకోవాలంటే పాత పద్ధతిలో అర్హమైన ఐటీ మినహాయింపుల్ని క్లెయిం చేసేందుకు కనీసం రూ.2.62,500 కోట్లు పొదుపు, పెట్టుబడుల్ని చేయాలి.