న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నిర్వహణా పగ్గాల్ని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తికి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం కొంత శాతం వాటా విక్రయించడంతో ఏడు నెలల క్రితం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఎల్ఐసీ షేరు వేగంగా పతనమైన నేపథ్యంలో ఈ బీమా సంస్థను ఆధునీకరించేదిశగా ప్రైవేటు రంగ వృత్తి నిపుణుడ్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా నియమించాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనంలో తెలిపింది.
ఈ మేరకు ఎల్ఐసీ సీఈవో నియామకానికి అవసరమైన అర్హతల్ని రూపొందించనున్నట్టు ఆ అధికారులు వెల్లడించారు. సంస్థ 66 ఏండ్ల చరిత్రలో ఉన్నతస్థాయి పదవిని ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తి చేపట్టడం ఇదే తొలిసారి కానుంది. ప్రైవేటు రంగ నిపుణుడ్ని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు ప్రభుత్వ అధికారి చెపుతూ ప్రైవేటు రంగానికి సమానంగా సీఈవోకు పే ప్యాకేజిని ఆఫర్ చేయాల్సివస్తే ఎల్ఐసీ చట్టాన్ని సవరించాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.బీమా, బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో ఏ రంగం నుంచి నిపుణుడ్ని కొత్త సీఈవోగా ఎంపికచేసేదీ అధికారులు వెల్లడించలేదు.
మార్కెట్ ఇన్వెస్టర్ల మెప్పు కోసం
ప్రైవేటు నిపుణుడి నియామకంతో షేర్హోల్డర్లకు శుభ సంకేతాల్ని అందించినట్లవుతుందని మరో ప్రభుత్వ అధికారి తెలిపారు. మే నెలలో పబ్లిక్ ఇష్యూ జారీ అయిన తర్వాత ఎల్ఐసీ షేరు 30 శాతంపైగా పతనమై రూ.2 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను హరించివేసిన సంగతి తెలిసిందే. దీంతో షేర్హోల్డర్ల విలువ పెంచేదిశగా ప్రైవేటు రంగ నిపుణుడ్ని నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆ అధికారి వివరించారు. ఈ బీమా దిగ్గజానికి నేతృత్వం వహించగల అర్హులైన నిపుణులు ప్రైవేటు రంగంలో ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ చెప్పారు. ఇది హానికరం కాదని, సబబైన నిర్ణయమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో కొన్ని బ్యాంక్లకు సీఈవోలుగా కేంద్రం ప్రైవేటు రంగంలోని వ్యక్తుల్ని నియమించిన సంగతి గమనార్హం.
చైర్మన్ పోస్టు రద్దు?
ఇప్పుడు ఎల్ఐసీకి ప్రభుత్వ రంగానికి చెందిన వ్యక్తే చైర్మన్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగిసిన తర్వాత ఆ పోస్ట్ను రద్దు చేస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ ఎల్ఐసీలోనే వివిధ స్థాయిల నుంచి ప్రమోట్ అయినవారే చైర్మన్లుగా నియమితులవుతూ వచ్చారు. ప్రస్తుత చైర్మన్ ఎంఆర్ కుమార్ అంతక్రితం నార్త్ జోన్ జోనల్ మేనేజర్గా పనిచేశారు. ఆయన పదవీ కాలాన్ని ఇప్పటికే రెండు దఫాలు ప్రభుత్వం పొడిగించింది. 2023 మార్చి 31తో కుమార్ పదవీ కాలం ముగుస్తుంది.
ప్రైవేటీకరణే కేంద్రం లక్ష్యం
ముందు ఐపీవో రూపంలో కొద్ది వాటా మార్కెట్లో విక్రయం..ఆ తర్వాత సంస్థలో అనుభవం ఉన్నవారిని కాదని ప్రైవేటు రంగం నుంచి తీసుకొచ్చే వ్యక్తికి పగ్గాలు అప్పగించడం…ఆ తర్వాత మరికొంత వాటా అమ్మేయడం-ఇలా ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం క్రమేపీ ప్రైవేటీకరిస్తుందన్న అనుమానాల్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఐసీ తొలి పబ్లిక్ ఇష్యూకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినపుడే వివిధ వర్గాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
పలు ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకంగా గొంతెత్తాయి. ఎల్ఐసీ ఉద్యోగులు ఎన్నో నిరసన ప్రదర్శనలు చేశారు. అయినా అన్నింటినీ కాలదన్ని ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయించి ప్రభుత్వం తన ఖజానాలో రూ. 20,000 కోట్లు జమచేసుకుంది. వచ్చే ఏడాది మలి పబ్లిక్ఇష్యూ తీసుకొచ్చి మరికొంత మొత్తాన్ని సమీకరించాలని యోచిస్తున్నది. తాజా గా రూ.41 లక్షల కోట్ల ఆస్తుల్ని నిర్వహించే ఈ దిగ్గజ సంస్థ పగ్గాల్ని సంస్థలో అనుభవం ఉన్నవారిని కాదని ఒక ప్రైవేటు నిపుణుడికి అప్పగించడానికి చూస్తుంటేనే మోదీ ప్రభుత్వం లక్ష్యం తెలిసిపోతున్నదని విశ్లేషకులు అంటున్నారు. అంతిమంగా ప్రైవేటుపరం చేయడమే ఆ లక్ష్యమని వ్యాఖ్యానించారు.