Truck Driver Cabin AC | ట్రక్కు డ్రైవర్ల పని పరిస్థితులు, ఓవరాల్ సేఫ్టీపై కేంద్రం ద్రుష్టి సారించింది. 2025 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి తయారయ్యే అన్ని రకాల నూతన ట్రక్కుల డ్రైవర్ క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్2, ఎన్3 క్యాటగిరీ ట్రక్కుల డ్రైవర్ క్యాబిన్లలో ఏసీ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ట్రక్కుల క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఏర్పాటును తప్పనిసరి చేయాలని గత జూలైలో రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్కు ఆమోదం లభించిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత జూలైలోనే ప్రకటించారు. ఇటీవల రవాణా రంగంలో ట్రక్కు డ్రైవర్లది కీలక పాత్ర అని పేర్కొన్నారు. డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు మెరుగైన పరిస్థితులు ఉండాలన్న ఆలోచనతోనే డ్రైవర్ క్యాబిన్లలో ఏసీ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్టన్లు తెలిపారు.
డ్రైవర్ క్యాబిన్లలో ఏసీ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం వల్ల వారి పని సామర్థ్యం పెరగడంతోపాటు వేడి వాతావరణంలో పని చేసే వారికి రిలీఫ్ లభిస్తుందన్నారు. ఇక సరుకుల రవాణాకు ఉపయోగించే ట్రక్కుల్లో 3.5 – 12 టన్నుల బరువు రవాణా చేసే ట్రక్కులను ఎన్2 క్యాటగిరీ, అంతకంటే ఎక్కువ బరువు రవాణా చేసే ట్రక్కులను ఎన్3 క్యాటగిరీగా నిర్ధారిస్తారు.