న్యూఢిల్లీ, జనవరి 28: దేశీయ టెలికం దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్లోనూ అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెడుతున్నది. ఇప్పటికే ఎయిర్టెల్ ప్రధాన ప్రత్యర్థి సంస్థ, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో ఈ గ్లోబల్ సెర్చింజన్ భారీగా నిధులను గుమ్మరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు సునీల్ మిట్టల్ నాయకత్వంలోని ఎయిర్టెల్లో కూడా రూ.7,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ మాతృ సంస్థ అల్భాబెట్ సిద్ధమైంది. దీంతో గూగుల్ ద్వారా జరుగుతున్న రెండో పెట్టుబడి ఇది అయ్యింది. రెండేండ్ల క్రితం భారత్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని గూగుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్విటీ డీల్స్, టై-అప్ల ద్వారా వచ్చే 5-7 ఏండ్లకుపైగా కాలంలో తమ డిజిటైజేషన్ ఫండ్లో భాగంగా ఈ పెట్టుబడులకు దిగుతామని నాడు సంస్థ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2020 జూలైలో జియో ప్లాట్ఫామ్స్లోని 7.73 శాతం వాటాను 4.5 బిలియన్ డాలర్ల (రూ.33,737 కోట్లు)తో గూగుల్ కొన్నది. జియో ప్లాట్ఫామ్స్ విలువను రూ. 4.36 లక్షల కోట్లు (58.1 బిలియన్ డాలర్లు)గా లెక్కించి డీల్ కుదుర్చుకున్నారు. ఈ పెట్టుబడులతో జియో బోర్డులో స్థానం సంపాదించిన గూగుల్.. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ ‘జియోఫోన్ నెక్స్’కూ సహకారం అందిస్తున్న సంగతి విదితమే.
ఒక్కో షేర్ రూ.734
తమ పెట్టుబడుల్లో రూ.5,250 కోట్లు (700 మిలియన్ డాలర్లు) చెల్లించి ఎయిర్టెల్లో మైనార్టీ వాటాను గూగుల్ సొంతం చేసుకోనున్నది. ఒక్కో షేర్ను రూ.734 చొప్పున రూ.5,224.3 కోట్లతో 1.28 శాతం వాటాలను కొంటున్నట్టు శుక్రవారం ఎయిర్టెల్ ప్రకటించింది. దీంతో గూగుల్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్సీకి రూ.5 ముఖ విలువ కలిగిన 71,176,839 ఈక్విటీ షేర్లను ఇస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ డీల్లో ఎయిర్టెల్ విలువను రూ.4.1 లక్షల కోట్లు (54.7 బిలియన్ డాలర్లు)గా లెక్కించారు. ఇక 300 మిలియన్ డాలర్లు (రూ.2,250 కోట్లు) వాణిజ్య ఒప్పందాల అమలుకు గూగుల్ కేటాయించింది. తొలి కమర్షియల్ అగ్రిమెంట్ కింద ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్స్ కోసం ఎయిర్టెల్స్ ఎక్స్టెన్సివ్ ఆఫర్ల నిర్మాణానికి ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. కాగా, దేశంలో 130 కోట్ల మందికి ఆకర్షణీయమైన సేవలు అందించాలంటే బహుళ విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పెట్టుబడులు అవసరమని ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ అన్నారు. గూగుల్ తమ పోటీ సంస్థ జియోలో కూడా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.
సరికొత్త ఆవిష్కరణలు
కస్టమర్లకు తక్కువ ధరకే ఆకర్షణీయమైన ప్రోగ్రామ్లను అందజేసేందుకు ఎయిర్టెల్, గూగుల్ సంయుక్తంగా కృషి చేయనున్నాయి. ‘భారీ వ్యూహాత్మక లక్ష్యాల భాగస్వామ్యం కింద ఇరు సంస్థలు కలిసి ముందుకు సాగుతాయి. 5జీ, ఇతర నెట్వర్క్ల బలోపేతానికి ఇది దోహదం చేయగలదు. ముఖ్యంగా భారతీయ డిజిటల్ ఎకోసిస్టమ్లో సరికొత్త ఆవిష్కరణలకు అవకాశాలు మెరుగవుతాయి’ అని ఎయిర్టెల్ తెలిపింది. ఈ భాగస్వామ్యం దేశంలో 10 లక్షలకుపైగా ఉన్న తమ చిన్న, మధ్యతరహా వ్యాపార కస్టమర్లకూ లాభించగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా సంస్థ వ్యక్తం చేసింది.
‘సరికొత్త ఆవిష్కరణలతో భారత డిజిటల్ డివిడెండ్ ఉన్నతికి ఎయిర్టెల్, గూగుల్ కృషి చేస్తాయి. మా భవిష్యత్తు నెట్వర్క్లు, డిజిటల్ వేదికలు, డిస్ట్రిబ్యూషన్, పేమెంట్స్ ఎకోసిస్టమ్స్తో ఆ దిశగా పయనిస్తాం’
-సునీల్ భారతీ మిట్టల్, భారతీ ఎయిర్టెల్ చైర్మన్
‘ఎయిర్టెల్లో మా వాణిజ్య, ఈక్విటీ పెట్టుబడులు.. ఇండియా డిజిటైజేషన్ ఫండ్కు గూగుల్ కట్టుబడి ఉందని చెప్తున్నాయి. మా ఇరు సంస్థల కలయిక దేశీయ వ్యాపార డిజిటలైజేషన్కు మరింతగా కలిసిరాగలదు’
-సుందర్ పిచాయ్, అల్ఫాబెట్, గూగుల్ సీఈవో