Gold Reserves | బంగారం అంటే మనవాళ్లకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం..పెండ్లిండ్లు.. ఇతర శుభకార్యాలు.. ప్రతి పండుగకి తమకున్న ఆదాయంలో కొంత బంగారం కొనుక్కోవడానికి కేటాయిస్తారు. కుటుంబ వేడుకల్లో తమ ఆభరణాలు ధరించడానికి ప్రాధాన్యం ఇస్తారు.. కానీ, భారత్ అవసరాలకు సరిపడా బంగారం దేశీయంగా లేదు.. కేవలం ఒక టన్ను మాత్రమే దేశంలో తయారవుతుంది. అందుకే చైనా తర్వాత విదేశాల నుంచి అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్నది భారత్. ప్రతియేటా 800 టన్నుల బంగారం అవసరం.
దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లు దాటింది. నాడు 1947లో తులం బంగారం (24 క్యారట్లు) ధర కేవలం రూ.88.62. కానీ, ఈనాడు రూ.59 వేల మార్క్ ను దాటేసింది. అంటే 76 ఏండ్లలో బంగారం ధర 661 రెట్లు పెరిగింది. మరోవైపు 1947లో కిలో వెండి ధర రూ.107 ఉంటే, ఇప్పుడు రూ.70 వేల పై చిలుకే.
ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక ప్రకారం భారతీయుల ఇండ్లలో 25 వేల టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వ ట్రెజరీలో 8,000 టన్నుల పై చిలుకు బంగారం నిల్వలు డిపాజిట్ చేసి ఉన్నాయి. అంటే అమెరికా ప్రభుత్వ ట్రెజరీలో కంటే మన ఇండ్లలో దాదాపు మూడు రెట్లు బంగారం నిల్వలు ఉన్నాయన్న మాట.
అమెరికా జియాలజికల్ సర్వే నివేదిక ప్రకారం భూ అంతర్భాగం నుంచి రెండు లక్షల టన్నుల బంగారం వెలికి తీశారు. ఇంకా మరో 50 వేల టన్నుల బంగారం మాత్రమే ఉందని ఆ నివేదిక చెబుతున్నది. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి భారత్ జియాలజికల్ సర్వే నివేదిక ప్రకారం కేవలం 5.86 టన్నుల బంగారం మాత్రమే భూగర్భంలో నిల్వలు ఉన్నాయి.