Russia-Ukraine War on Gold | బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం.. పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ రూట్ కూడా.. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడికి దిగడంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2100 డాలర్లకు.. దేశీయ విపణిలో రూ.56 వేల మార్క్కు చేరొచ్చునని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత రెండు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.3,505 పెరిగింది. జనవరి ఒకటో తేదీన రూ.48,279 పలికిన తులం బంగారం ధర.. తాజాగా రూ.51,784లకు చేరుకున్నదని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ పేర్కొంది. ఈ వారంలో పది గ్రాముల బంగారం ధర రూ.894 పెరిగి రూ.51,784 వద్ద స్థిర పడిందని వివరించింది. గత నెల 28న 24 క్యారట్ల బంగారం తులం రూ.50,890 పలికింది.
ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ (కమొడిటీ అండ్ కరెన్సీ) వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్లే బంగారం రేట్లు పెరుగుతున్నాయన్నారు. వచ్చే రెండు, మూడు నెలల్లో తులం బంగారం ధర రూ.56 వేలకు చేరుతుందని అంచనా వేశారు. గ్లోబల్ మార్కెట్లో వచ్చే 2,3 నెలల్లో ఔన్స్ బంగారం ధర 2100 డాలర్ల వద్ద రికార్డు నెలకొల్పుతుందన్నారు.
మరోవైపు కిలో వెండి ధర రూ.5,896 పెరిగి రూ.68 వేలకు చేరుతున్నది. జనవరి ఒకటితో పోలిస్తే వెండి కిలో ధర రూ.62,035 నుంచి రూ.67,931 వద్ద స్థిర పడిందని ఐబీజేఏ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో రూ.65,354 పలికిన బంగారం తాజాగా రూ.67,931 వద్ద నిలిచింది. ఈ వారంలో కిలో వెండి ధర రూ.2,577 పెరిగింది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధంతో అంతర్జాతీయంగా తలెత్తిన ఉద్రిక్తతలే బంగారం ధర పెరుగుదలకు కారణం అని కేడియా కమొడిటీ డైరెక్టర్ అజయ్ కెడియా చెప్పారు. ఈ ఏడాది 24 క్యారట్ల బంగారం తులం రూ.55 వేల వద్ద కొనసాగవచ్చునన్నారు. మరోవైపు కిలో వెండి ధర రూ.80-85 వేలకు చేరుతుందని అంచనా వేశారు.