న్యూఢిల్లీ, మార్చి 6: బంగారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాటు దేశీయంగా మదుపరులు ప్రాఫిట్ బుకింగ్నకు మొగ్గుచూపడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం విలువ రూ.1,100 తగ్గి రూ.1.64 లక్షలకు దిగొచ్చింది. వరుసగా రెండోరోజు ధరలు తగ్గడం విశేషం.
వెండి ధర రూ.2.71 లక్షల దిగువకు పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి రూ.600 తగ్గి రూ.2,71,700కి జారుకున్నదని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా యుద్ధం చేయడంతో ఇటీవల రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతే వేగంతో కిందికి పడిపోతున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
రూపాయితో పోలిస్తే డాలర్ బలోపేతం కావడం, ట్రెజరీ ఈల్డ్స్ కూడా పెరగడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్స్ గోల్డ్ 14.70 డాలర్లు అందుకొని 5,095.81 డాలర్లు పలుకగా, వెండి 1.4 శాతం బలపడి 83.40 డాలర్ల వద్ద స్థిరపడింది.